హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసిన చంద్రబాబు
సుప్రీం కోర్టును ఆశ్రయించిన చంద్రబాబు
న్యూ ఢిల్లీ రిపోర్ట్- ఆంద్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) సుప్రీం కోర్టును (Supreme Court) ఆశ్రయించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్ పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. తనపై విజయవా ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్ ను క్వాష్ చేయాలని సుప్రీం కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్లో కోరారు చంద్రబాబు. ఈ పిటిషన్ ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎదుట ప్రత్యేకంగా మెన్షన్ చేసి, వెంటనే విచారణ చేపట్టాలని కోరే అవకాశం ఉందని న్యాయవాదులు తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడీ దర్యాప్తు తుది దశలో ఉన్నందున ఈ సమయంలో జోక్యం చేసుకోలేమంటూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు చంద్రబాబు. సోమవారం ఈ పిటీషన్ విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.