ISRO Chandrayaan

సక్సెస్ ఫుల్ గా చంద్రయాన్-3 చివరి భూకక్ష్య పెంపు - ఇక చందమామ పైకే

నేషనల్ రిపోర్ట్- చంద్రుడి (Moon) పై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో (ISRO) ప్రయోగించిన చంద్రయాన్‌-3 (Chandrayaan-3) వ్యోమనౌక తన లక్ష్యం దిశగా మరో అడుగు ముందుకేసింది. ఇప్పటి వరకు నాలుగో కక్ష్యలో భూమిచుట్టూ తిరిగిన చంద్రయాన్-3 వ్యౌమనౌకకు సంబంధించిన అయిదో కక్ష్య పెంపు (Orbit Raising Manoeuvre)ను ఇస్రో మంగళవారం విజయవంతంగా నిర్వహించింది. బెంగళూరు (Bangalore) లోని ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ (ISTRAC) నుంచి ఈ ప్రక్రియను చేపట్టింది. దీంతో చంద్రయాన్‌-3 ఇప్పుడు 127609 కిలో మీటర్లు x 236 కిలో మీటర్ల దూరంలోని కక్ష్యలోకి చేరుకునే అవకాశం ఉందని ఇస్రో ప్రకటించింది.

భూమి చుట్టూ పరిభ్రమించే విషయంలో చంద్రయాన్‌-3 కి సంబంధించి ఇది చివరి కక్ష్య. దీని తరువాత చంద్రయాన్-3 వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఈ ప్రక్రియను (Trans Lunar Injection) ఆగస్టు 1న చేపట్టనున్నట్లు ఇస్రో ప్రకటించింది. చంద్రయాన్-3 వ్యోమనౌకను జులై 14న ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్‌ ద్వారా విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టింది ఇస్రో. ఆ తరువాతి రోజు జులై 15న తొలిసారిగా దీని కక్ష్యను పెంచారు. ఇప్పటివరకు దశలవారీగా అయిదుసార్లు కక్ష్యను పెంచి చంద్రయాన్‌-3ని జాబిల్లికి చేరువచేస్తూవస్తున్నారు. అయిదో భూకక్ష్య పూర్తయిన తరువాత చంద్రయాన్-3 వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. అంతా అనుకున్నవిదంగా జరిగితే ఆగస్టు 23న సాయంత్రం చంద్రుడి దక్షిణ ద్రువంపై ల్యాండర్‌ సురక్షితంగా దిగి తన పని మొదలుపెడుతుంది.


Comment As:

Comment (0)