కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలి
మాజీ సీఎం కేసీఆర్ను పరామర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్ రిపోర్ట్- తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) త్వరగా కోలుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ను సీఎం రేవంత్ (CM Revanth Reddy) ఆదివారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ను పరామర్శించానని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఆయన క్రమంగా కోలుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ వైద్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ ను ఆదేశించినట్లు తెలిపారు. కేసీఆర్ త్వరగా కోలుకొని అసెంబ్లీకి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పిన సీఎం.. మంచి ప్రభుత్వ పాలన అందించడానికి ఆయన సూచనలు అవసరం ఉందని అన్నారు. త్వరగా కోలుకుని అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని కేసీఆర్ను కోరినట్లు చెప్పారు. రేవంత్ రెడ్డి వెంట మంత్రి సీతక్క, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ తదితరులు ఉన్నారు.