ఆర్టీసీ బిల్లుపై తెలంగాణ గవర్నర్ తమిళిసై న్యాయ సలహా కోరారు
ఆర్టీసీ బిల్లుపై న్యాయ సలహా కోరిన గవర్నర్ తమిళిసై
స్పెషల్ రిపోర్ట్- తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) న్యాయ సలహా కోరారు. ఈమేరకు ఆర్టీసీ బిల్లుతో (TSRTC Bill) పాటు మరో నాలుగు బిల్లులను న్యాయశాఖ కార్యదర్శికి పంపించింది రాజ్ భవన్ (Rajbhavan). ఆర్టీసి బిల్లుకు సంబందించిన తన సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్నారా, లేదా అన్నది నిర్ధారించాలని గవర్నర్ అడిగారు. న్యాయశాఖ కార్యదర్శి సిఫార్సుల ఆధారంగా ఆర్టీసి బిల్లులు సహా ఇతర బిల్లులపై తదుపరి చర్యలు ఉంటాయని రాజ్భవన్ వర్గాలు స్పష్టం చేశాయి. బిల్లుల విషయంలో కొందరు దురుద్దేశంతో చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్రజలు, ఆర్టీసి ఉద్యోగులు నమ్మొద్దని గవర్నర్ విజ్ఞప్తి చేశారు.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత కూడా టీఎస్ఆర్టీసీకి చెందిన భూములు, ఆస్తుల యాజమాన్యం సంస్థ చేతిలోనే ఉండాలని, వాటిని సంస్థ అవసరాలకి మాత్రమే వినియోగించాలని గవర్నర్ సిఫారసు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి తగ్గట్లుగా ఆర్టీసి ఆస్తుల విభజన పూర్తి చేయాలని చెప్పారు. ఉమ్మడి ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఉద్యోగులకు అందాల్సిన బకాయిల చెల్లింపు బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పారు.
విలీనం తరువాత ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లాగానే పేస్కేల్స్, సర్వీస్ నిబంధనలు ఉండాలని, జీతాలు, ట్రాన్స్ ఫర్స్, ప్రమోషన్స్, పదవీ విరమణ పింఛన్లు, పీఎఫ్, గ్రాట్యుటీ వంటి అన్ని సదుపాయాలు కల్పించాలని గవర్నర్ చెప్పారు. ఏవైనా కారణాలను చూపుతూ ఆర్టీసీ కార్మికులు విజ్ఞప్తి చేసుకొంటే వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలకు అవకాశం కల్పించాలని సిఫారసు చేశారు. ప్రభుత్వంలో విలీనం చేసుకొన్న ఆర్టీసీ ఉద్యోగులను ఇతర ప్రభుత్వ శాఖలకు డిప్యూటేషన్ మీద పంపితే వారి స్థాయి, జీతం, పదోన్నతులకు రక్షణ కల్పించాలని గవర్నర్ చెప్పారు. Telangana RTC Bill