Newspillar
Newspillar
Friday, 28 Jul 2023 18:30 pm
Newspillar

Newspillar

పొలిటికల్ రిపోర్ట్- ప్రముఖ సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ (Jayasudha) బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది.  ఈమేరకు శనివారం కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి (Kishan Reddy) ని కలిసి తాజా రాజకీయాలపై చర్చించారు జయసుధ. ఈ సందర్భంగా బీజేపీ (BJP) లో చేరికపై జయసుధ, కిషన్ రెడ్డితో చర్చించినట్టు సమాచారం. జయసుధ బీజేపీలో చేరితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ (Secunderabad) లేదంటే ముషీరాబాద్‌ (Musheerabad) నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశముంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. 

బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ (Etala Rajender) ఇటీవల జయసుధతో సమావేశమై పార్టీలోకి ఆహ్వానించగా, అందుకు ఆమె సుముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఐతే బీజేపీలో చేరికపై జయసుధ ఇంకా స్పందించలేదు. జయసుధ గతంలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపొందారు. ఐతే కొంత కాలంగా జయసుధ ప్రత్యక్ష్య రాజకీయాలకు అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇటువంటి సమయంలో ఆమె బీజేపీ పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడం ఆసక్తకరంగా మారింది.