మూవీ రిపోర్ట్- సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) తన తాజా సినిమా జైలర్ (Jailer) ఆడియో వేడుకలో ఆవేధనో కూడిన వ్యాఖ్యలు చేశారు. మొరగని కుక్కా లేదు, విమర్శించని నోరూ లేదు, ఈ రెండూ లేని ఊరు లేదు, ఎవరేం చెప్పినా మన పని మనం చేసుకుంటూ పోవాలి, అర్థమైందా రాజా.. అంటూ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లో సైతం ఆసక్తికరంగా మారాయి. చెన్నైలో జరిగిన జైలర్ ఆడియో విడుదల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఒకప్పుడు తనకు ‘సూపర్స్టార్’ (Super Star) బిరుదు ఇస్తుంటే నిరాకరించానని చెప్పిన రజనీకాంత్.. వెంటనే అందరూ నేను వెనకడుగు వేశానన్నారని గుర్తు చేశారు. శివాజి గణేశన్, కమల్హాసన్ లాంటి వాళ్లు నటిస్తుండగా నాకెందుకు ఆ సూపర్స్టార్ అనుకున్నానని చెప్పారు. ఇప్పుడు కూడా అలాంటి సమస్యే వస్తోందని, కానీ నేను వాటి గురించి పట్టించుకోనని అన్నారు. మొరగని కుక్క లేదు.. విమర్శించని నోరూ లేదు.. ఇవి రెండూ లేని ఊరూ లేదు.. ఎవరేం చెప్పినా మన పని మనం చేసుకుంటూ పోతుండాలి.. అర్థమైందా రాజా.. అని తన శైలిలో రజనీకాంత్ వ్యాఖ్యానించారు.
ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏపీ మంత్రులు ఆ మధ్య రజనీ కాంత్ ను విమర్శించిన సంగతి తెలిసిందే. వారిని ఉద్దేశిస్తూనే రజనీకాంత్ ఈ వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్ నటించిన జైలర్ గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది.