అక్టోబరు 3కు చంద్రబాబు కేసు విచారణ
చంద్రబాబు క్వాష్ పిటీషన్ పై విచారణను వాయిదా వేసిన సుప్రీం కోర్టు
న్యూ ఢిల్లీ రిపోర్ట్- ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన ఎస్ఎల్పీపై సుప్రీం కోర్టులో (Supreme Court) విచారణ వాయిదా పడింది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు అక్టోబరు 3వ తేదీకి వాయిదా వేసింది. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని చంద్రబాబు సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేశారు. గత శుక్రవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి చంద్రబాబు క్వాష్ పిటిషన్ను తిరస్కరిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు అక్టోబరు 3వ తేదీకి వాయిదా వేసింది.