విరాట్ కోహ్లి మరో ప్రపంచ రికార్డు.. 500వ మ్యాచ్లో అత్యంత అరుదైన ఫీట్
స్పోర్ట్స్ రిపోర్ట్- టీం ఇండియా (Team India) మాజీ కెప్టెన్, స్టార్ క్రికెట్ ప్రేయర్ విరాట్ కోహ్లి (Virat Kohli) మరో రికార్డ్ సొంతం చేసుకున్నాడు. వెస్టిండీస్తో రెండో టెస్టు సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో క్రికెటర్లకు అత్యంత అరుదుగా సాధ్యమయ్యే ఫీట్ను సాధించాడు. విరాట్ కోహ్లి తన పదిహేనేళ్ల కెరీర్లో 500వ మ్యాచ్ అనే మైలురాయిని చేరుకోవడం విశేషం. టీమిండియా-వెస్టిండీస్ (West Indies vs India) మధ్య ఇది చారిత్రాత్మక వందో టెస్టు. ఈ క్రమంలో అత్యంత ప్రత్యేకమైన మ్యాచ్ లోనూ విరాట్ తనదైన ముద్ర వేశాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన కోహ్లి అర్ధ శతకంతో తన సత్తా చాటాడు.
గురువారం ట్రినిడాడ్లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో విండీస్తో తొలి రోజు ఆట ముగిసే సరికి 161 బంతులు ఎదుర్కొన్న కోహ్లి, 87 రన్స్ తో అజేయంగా నిలిచి ఔరా అన్పించాడు. ఈ నేపధ్యంలో విరాట్ కోహ్లి ఖాతాలోకి మరో ప్రపంచ రికార్డు వచ్చి చేరింది. 500వ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్ గా విరాట్ రికార్డ్ సృష్టించాడు. విరాట్ కోహ్లి కంటే ముందు 9 మంది క్రికెటర్లు 500 మ్యాచ్ ల మార్కు దాటినప్పటికీ, అంతకు ముందు వీరికి ఈ ఫీట్ సాధ్యం కాలేదు. ఇప్పటికే సమకాలీన క్రికెటర్లలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న విరాట్ ఈ అరుదైన ఘనత సాధించి సరిలేరు నాకెవ్వరు అని నిరూపించుకున్నాడు.