119 నియోజకవర్గాల్లో పోటీకి సిద్దమైన వైఎస్ షర్మిల
తెలంగాణ ఎన్నికల బరిలో షర్మిల,అనిల్, విజయమ్మ
లోటస్ పాండ్ రిపోర్ట్- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (YSRTP) అధినేత్రి వైఎస్ షర్మిల (YS Sharmila) నిర్ణయించారు. ఈ మేరకు లోటస్ పాండ్ లో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో నిర్ణయించారు. ముందుగా నిర్ణయించిన మేరకు పాలేరు నియోజకవర్గం నుంచి షర్మిల బరిలోకి దిగనున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న వారు పార్టీ బీఫామ్ ల కోసం దరఖాస్తు చేసుకోవాలని షర్మిల సూచించారు. మరోవైపు పాలేరుతో పాటు మరోచోటు నుంచి కూడా పోటీ చేయాలని నేతలు, కార్యకర్తల నుంచి డిమాండ్ ఉందని షర్మిల చెప్పారు.
అంతే కాదు బ్రదర్ అనిల్ (Bro Anil), విజయమ్మను (YS Vijayamma) కూడా పోటీ చేయించాలని కోరుతున్నారని, అవసరమైతే వారిద్దరూ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారని అన్నారు షర్మిల. కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదని భావించామన్న షర్మిల, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిస్తే కేసీఅర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారేమో అనుకున్నామని చెప్పారు. అందుకోసమే కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపామని, నాలుగు నెలలు ఎదురు చూసి ఫలితం లేకుండా పోయిందని అన్నారు. అందుకే ఇక ఒంటరిగానే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు నేతలకు, కార్యకర్తలకు చెప్పారు షర్మిల.