అభిమాని మృతిపై దర్యాప్తు చేయాలని ఎన్టీఆర్ విజ్ఞప్తి
సినిమా డెస్క్- అభిమానుల పట్ల యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంత సహృదయంతో ఉంటారో అందరికి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ (shyam) అనుమానాస్పదంగా మృతి చెందడం ఆయనను తీవ్ర ఆవేధనకు గురిచేసింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్యామ్ ఎన్టీఆర్ వీరాభిమాని. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. ఈరోజు శ్యామ్ అనుమానాస్పద రీతిలో ఉరి వేసుకుని చనిపోయాడు. దీంతో శ్యామ్ కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్ అభిమానులు అతడి మరణంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని రోజులక్రితం విష్వక్ సేన్ నటించిన దమ్కీ ప్రీరిలీజ్ ఈవెంట్లో శ్యామ్ వేగంగా స్టేజ్ పైకి వచ్చి ఎన్టీఆర్ ను పట్టుకున్నాడు. దీంతో ఎన్టీఆర్ భద్రతాసిబ్బంది అతడిని లాగేందుకు ప్రయత్నించగా ఎన్టీఆర్ వారిని ఆపి శ్యామ్ తో ఫొటో దిగారు. అప్పట్లో ఘటనతో పాటు శ్యామ్ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఇప్పుడిలా శ్యామ్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ (NTR) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
శ్యామ్ మరణం తననెంతో కలచివేసిందంటూ ట్విటర్ వేదికగా స్పందించారు. శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన ఘటన. అతడి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసును కలచి వేసింది.. అని ట్వీట్ లో రాసుకొచ్చారు ఎన్టీఆర్. అంతే కాదు శ్యామ్ మరణంపై ప్రభుత్వ అధికారులు వెంటనే దర్యాప్తు జరపాలని ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు. శ్యామ్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని కుటుంబసభ్యులు అనడంతో అతడి మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.