స్పెషల్ రిపోర్ట్- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు హైదరాబాద్ లో ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించారు. గౌలిదొడ్డిలోని కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలను తాను సేకరించిన సుమారు కోటి రూపాయల నిధులతో హిమన్షు ఆధునీకరించేందుకు సాయం చేశారు. పాఠశాలలో చేపట్టిన ఆధునికీకరణ పనులు పూర్తవ్వడంతో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి హిమాన్షురావు ప్రారంభించారు. మొదటిసారి ఈ పాఠశాలను చూడటానికి వచ్చినపుడు తన కళ్ల నుంచి నీళ్లు వచ్చాయని ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షురావు అన్నారు. ఆడపిల్లలకు సరైన బాత్ రూమ్ లు లేవని.. స్కూల్లో మెట్లు కూడా సరిగా లేవని గుర్తు చేసుకున్నారు. అలాంటి పరిస్థితులను తానెప్పుడూ చూడలేదని చెప్పారు.
ఇక పాఠశాలను ప్రారంభించాక హిమాన్షు రావు స్కూల్ విధ్యార్ధులను ఉద్దేశించి మాట్లాడారు. ఇది తన మొదటి పబ్లిక్ స్పీచ్ అని చెప్పిన హిమాన్షు.. అయినా కొత్తవారితో మాట్లాడుతున్నట్లు లేదని, నా కుటుంబం ముందు మాట్లాడుతున్నట్లు ఉందని చెప్పారు. సుమారు ఏడాది నుంచి వచ్చి స్కూల్ ఆధునీకరణ పనులు ఎలా జరుగుతున్నాయో చూసి వెళ్లేవాడినని తెలిపారు. కేసీఆర్ మనవడిని కదా.. ఏదైనా నార్మల్గా చేసే అలవాటు లేదు.. గొప్పగా చేయాలన్నదే ఆలోచన. నిధులు సేకరించి పేదలకు ఉపయోగపడేలా ఖర్చు చేయాలనుకున్నామని.. మా స్కూల్ ప్రొగ్రాంలో భాగంగా ఈ స్కూల్ కి గోడలు కట్టించాలి అన్నారని చెప్పారు. మొదటిసారి ఇక్కడికి వచ్చినపుడు నా కళ్ల వెంట నీళ్లు వచ్చాయన్నారు.
రెండు పెద్ద ఈవెంట్స్ చేసి మొత్తం 40లక్షల రూపాయలు సేకరించామని చెప్పిన హిమాన్షు.. ఆ తర్వాత సీఎస్ఆర్ కింద మధుసూదన్ సహాయం చేశారని తెలిపారు. ఈ స్కూల్ కి మంచి చేయడానికి నాకు మా తాత కేసీఆరే స్ఫూర్తి అని చెప్పిన హిమాన్షు.. చదువుకున్న సమాజం.. పేదరికాన్ని అరికట్టే ఉపాయం ఉంటుంది అని కామెంట్ చేశారు. అందుకే ఈరోజు ఈ పాఠశాల బాగు కోసం సహాయం చేశానని చెప్పారు. తన గ్రేడ్ చదువులో తగ్గినా.. వంద మందికి సహాయం చేసే అవకాశం ఉంటే చేయాలని తన తండ్రి కేటీఆర్ చెప్పారని ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు హిమాన్షు.