Newspillar
Newspillar
Thursday, 05 Oct 2023 18:30 pm
Newspillar

Newspillar

అమరావతి- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళగిరిలో పర్యటిస్తున్న పవన్.. మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని నడిపించే ఐఏఎస్‌ అధికారులకు 20 వ తేదీ వరకు జీతాలు చెల్లించకపోవడం దారుణమని ఈ సందర్బంగా పవన్‌ కల్యాణ్ మండిపడ్డారు. ఐఏఎస్‌ లకు జీతాలు ఇవ్వలేని స్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. జీతాలు రాక కాంట్రాక్టు ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని.. ఐఏఎస్‌ అధికారుల జీతాలు సైతం మళ్లించారని అన్నారు. ఇది ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘనే అన్న పవన్.. వైసీపీ నేతలకు రాజ్యాంగ ఉల్లంఘన అలవాయుగా మారిందని వ్యాఖ్యానించారు. అసమర్థ ప్రభుత్వ పాలనతో సమస్యలు లేవనెత్తిన వారందరిపై దాడులు చేస్తున్నారని చెప్పారు. 

కేసులు వాయిదా వేయించుకోవడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌, ఎంపీలు దిల్లీకి వెళ్తున్నారా.. అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. బీజేపీతో (BJP) పొత్తు పోయిందని వైసీపీ నేతలు అంటున్నారని పవన్‌ అన్నారు. పొత్తులపై ఎవరికీ చెప్పాల్సిన పని లేదని, ప్రజలకే చెబుతామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన పసుపు బోర్డు కలను కేంద్ర ప్రభుత్వం సాకారం చేసిందని పవన్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ దిల్లీ వెళ్లినా జీడిపప్పు, కొబ్బరి బోర్డుల కోసం కృషి చేయలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి సీబీఐ కేసులు వాయిదా వేయించుకోవడానికి జగన్ దిల్లీ వెళ్తున్నారని ఆరోపించారు పవన్ కళ్యాణ్. 2024 ఎన్నికల్లో టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ కలిసి పోటీ చేయాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు పవన్. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనేదే తన ఆకాంక్ష అని ఈ సందర్బంగా ఆయన స్పష్టం చేశారు.