Newspillar
Newspillar
Saturday, 21 Oct 2023 18:30 pm
Newspillar

Newspillar

అమరావతి రిపోర్ట్- తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) కంటతడి పెట్టుకున్నారు. తన తండ్రి, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) గురించి మాట్లాడుతూ కన్నీటి పర్వంతం అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడిన ప్రజా నాయకుడు చంద్రబాబు అని లోకేశ్‌ అన్నారు. టీడీపీ (TDP) విస్తృత స్థాయి సమావేశంలో లోకేశ్‌ ప్రసంగం గద్గద స్వరంతో సాగింది. ప్రజల కోసం పోరాడిన నాయకుడు చంద్రబాబు అంటూ సమావేశ వేదికపైనే కన్నీరు పెట్టుకున్నారు నారా లోకేశ్. టీడీపీ-జనసేన పోరాడకుంటే రాష్ట్రాన్ని జగన్ ముక్కలు చేసి అమ్మేసేవాడని అన్నారు. తెలుగుదేశం-జనసేన (TDP-Janasena) కలిసి పోటీ చేస్తే 160 స్థానాలు గెలవడం ఖాయమని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు.

ఏ తప్పు చేయకున్నా చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టారని ఫైర్ అయ్యారు. ఏరోజైనా మా అమ్మ బయటకొచ్చారా.. చివరకు మా తల్లిపైనా కేసులు పెడతామని బెదిరిస్తున్నారని లోకేశ్ తీవ్ర ఆవేధన చెందారు. చంద్రబాబుకు పంపించే భోజనంలో విషం కలుపుతారని మాపై ఆరోపణలు చేస్తున్నారని, భోజనాల్లో విషం కలపడం, కోడికత్తి డ్రామాలు మా డీఎన్‌ఏలోనే లేవని కామెంట్ చేశారు. ఇతర రాష్ట్రాల రాజధానులకు దీటుగా మన రాజధాని ఉండాలని అహర్నిశలు కష్టపడినందుకు చంద్రబాబును జైల్లో బంధించారని లోకేశ్ ఆరోపించారు. కుటుంబం గురించి ఒక్క క్షణం కూడా పట్టించుకోకుండా అహర్నిశలు ప్రజల గురించే చంద్రబాబు ఆలోచించారని చెప్పారు.