ఇస్లాం స్వీకరించి ఫాతిమాగా మారిన అంజూ
పాకిస్థాన్ ప్రియుడిని పెళ్లాడిన భారత మహిళ
స్పెషల్ రిపోర్ట్- భారత్ లోని తన ప్రియుడికోసం తన నలుగురు పిల్లలను తీుసుకుని వచ్చిన పాకిస్థాన్ (Pakistan) మహిళకు సంబందించిన వివాదం కొనసాగుతుండగానే.. ఇండియా నుంచి వెళ్లి పాకిస్థాన్ ప్రియుడిని పెళ్లాడేసింది మరో మహిళ. ప్రియుడిని కలుసుకోవడానికి పాకిస్థాన్ వెళ్లిన 34 ఏళ్ల రాజస్థాన్ (Rajasthan) మహిళ అంజూ (Anju) వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సు అప్పర్ దిర్ జిల్లాలోని స్థానిక కోర్టులో అంజూ, 29 ఏళ్ల ఆమె ప్రియుడు నస్రుల్లా (Nasrullah) మంగళవారం వివాహం చేసుకున్నారని డీఐజీ స్థాయి అధికారి ఒకరు తెలిపారు.
పెళ్లికి ముందు అంజూ ఇస్లాం స్వీకరించి ఫాతిమా (Fathima) గా పేరు మార్చుకుంది. ఎవరి బలవంతం లేకుండా నిఖా చేసుకుంటున్నామని వధూవరులు అంగీకరించారని, బంధువులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, పోలీసుల సమక్షంలో ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఈ నిఖా జరిగిందని అధికారి తెలిపారు. పెళ్లి చేసుకోవడానికి ముందు సోమవారం అంజూ, నస్రుల్లాలు భారీ భద్రత మధ్య స్థానిక పర్యాటక ప్రాంతాలను సందర్శించారు.
స్థానకంగా ఉండే ఓ పార్క్ లో ఇద్దరూ చేతిలో చేయి వేసుకుని ఫొటోలకు ఫోజులు కూాడా ఇచ్చారు. ఇక తన పాకిస్థాన్ పర్యటన అనుకోకుండా జరిగింది కాదని అంజూ (ఫాతిమా) చెప్పినట్లు పాక్ వార్తా సంస్థ జియో (Jio News) తన వార్తా కధనంలో రాసింది. తన ప్రేమను వెతుక్కుంటూ పాకిస్థాన్ వచ్చానని, ఇక్కడే ఉండిపోతానని అంజూ తమకు చెప్పినట్లు స్థానిక పోలీసు అధికారి ఒకరు చెప్పారని జియో పేర్కొంది. ఏదేమైనా భారత మహిళ అంజూ పాకిస్థాన్ యువకుడిని ప్రేమ వివాహం చేసుకోవడం రెండు దేశాల్లో సంచలనం రేపుతోంది.