చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
కుప్పం రిపోర్ట్- ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసం చంద్రబాబు (Chandrababu) రాత్రింబవళ్లు కష్టపడ్డారని నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) చెప్పారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ముందుకొచ్చారని, కానీ ఇవాళ పరిశ్రమలు రాకపోగా ఉన్నవి పోయాయని అన్నారు. వైసీపీ పాలనలో టీడీపీ కార్యకర్తలను తీవ్రంగా వేధించారని భువనేశ్వరి తెలిపారు. ఈ రాక్షస పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారన్న ఆమె.. ఓటు అనే ఆయుధంతో రాక్షస పాలనను అంతం చేయాలని పులుపినిచ్చారు.
అందరం కలిసి ప్రజల ప్రభుత్వాన్ని తీసుకొద్దామని, కులమతాలు వేరైనా మనమంతా ఆంధ్రులమని భువనేశ్వరి చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. ఈమేరకు కుప్పంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు భువనేశ్వరి. అంతకుముందు కుప్పంలో భారీ ర్యాలీగా ఆర్వో కార్యాలయం వద్దకు చేరుకున్నారు భువనేశ్వరి. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.