17 నిమిషాల టెర్రర్ గా అభివర్ణించిన ఇస్రో
చంద్రయాన్-3 ల్యాండింగ్.. చివరి 17 నిమిషాలే అత్యంత కీలకం
స్పెషల్ రిపోర్ట్- చందమామపై చంద్రయాన్-3 (Chandrayaan-3) వ్యోమనౌక అడుగుపెట్టబోతోంది. ఈ చారిత్రక క్షణాల కోసం మొత్తం భారతీయులతో పాటు ప్రపంచమంతా వేయికళ్లతో ఎదురుచూస్తోంది. బుధవారం సాయంత్రం సరిగ్గా 6.04 గంటలకు ఆ అరుదైన ఘట్టాన్ని ఆవిష్కరించేందుకు ఇస్రో (ISRO) అన్ని ఏర్పాట్లు చేసింది. చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ (Vikram Lander), ప్రజ్ఞాన్ రోవర్ (Pragyan Rover) తో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ చంద్రుడికి మరింత దగ్గరైంది. ఈ క్రమంలో ఇది చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ (Soft Landing) అయ్యే క్రమంలో చివరి 17 నిమిషాలు (17 Minutes of Terror) అత్యంత కీలకమని ఇస్రో సైంటిస్టులు తెలిపారు.
చందమామ దక్షిణ ధృవంపై నిర్దేశిత ల్యాండింగ్ ప్రదేశంలో దిగేందుకు సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్నట్లు ఇస్రో పేర్కంది. సూర్య కాంతి వెలువడగానే విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను చేపట్టనుంది ఇస్రో. బుధవారం సాయంత్రం సుమారు 5.45 గంటల తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభం అవ్వనున్నట్లు అంచనా వేస్తున్నారు. అతి కీలకమైన, క్లిష్టమైన ఈ సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను 17 నిమిషాల టెర్రర్ గా ఇస్రో చెబుతోంది. విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ లో పారామీటర్లు అన్నింటినీ తనిఖీ చేసి, చంద్రుడి దక్షిణ ధృవంపై ఎక్కడ ల్యాండ్ అవ్వాలో నిర్దేశించుకున్న తర్వాత బెంగళూరులోని ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ నుంచి ఇస్రో అందుకు సంబంధిత కమాండ్స్ ను ల్యాండర్ మాడ్యూల్ కు అప్ లోడ్ చేస్తుంది.
ఈ ప్రక్రియను షెడ్యూల్డ్ ల్యాండింగ్ కు సుమారు రెండు గంటల ముందు నిర్వహించనుంది ఇస్రో. ఇక విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కోసం చందమామ ఉపరితలానికి 30 కిలో మీటర్ల ఎత్తులో ల్యాండర్ పవర్ బ్రేకింగ్ దశలోకి అడుగుపెడుతుంది. అక్కడి నుంచి చివరి 17 నిమిషాలు చాలా ఉత్కంఠభరితంగా సాగనుంది. చంద్రుడి ఉపరితలానికి దగ్గరయ్యేందుకు విక్రమ్ ల్యాండర్ తన నాలుగు ఇంజిన్లను ఒకేసారు మండించుకుంటుంది. ఆ తరువాత మెల్లిగా తన స్పీడ్ ను తగ్గించుకుంటుంది. చంద్రుడి ఉపరితలానికి వెళ్లే సమయంలో ల్యాండర్ వేగం సెకనుకు 1.68 కిలో మీటర్లుగా ఉంటుంది. చందమామ ఉపరితలానికి 6.8 కిలో మీటర్ల ఎత్తుకు చేరిన తర్వాత విక్రమ్ ల్యాండర్ తన రెండు ఇంజిన్లను ఆఫ్ చేసి మరో రెండు ఇంజిన్ల ద్వార క్రమంగా స్పీడ్ ను తగ్గించుకుంటుంది. రివర్స్ థ్రస్ట్ తో మరింత కిందకు వచ్చేందుకు ట్రై చేస్తుంది.
విక్రమ్ ల్యాండర్ ఇంకా చంద్రుడి ఉపరితలానికి సమాంతరంగానే ఉంటుంది. దీన్ని రఫ్ బ్రేకింగ్ స్టేజ్ గా పిలుస్తారు. ఈ ప్రక్రియ అంతా 11 నిమిషాల పాటు కొనసాగనుంది. ఆ తర్వాత విక్రమ్ ల్యాండర్ ఫైన్ బ్రేకింగ్ స్టేజ్ లోకి ప్రవేశిస్తుంది. ఈ సమయంలో ల్యాండర్ 90 డిగ్రీలు వంపు తిరుగి, చంద్రుడి ఉపరితలంపై నిలువు స్థానానికి దిగుతుంది. 2019లో ఇక్కడే చంద్రయాన్-2 నియంత్రణ కోల్పోయి క్రాష్ ల్యాండ్ అయ్యింది. మెల్లగా తన వేగాన్ని తగ్గించుకుంటూ చంద్రుడి ఉపరితలానికి 800 మీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాత ల్యాండర్ నిలువు, అడ్డం వేగాలు సున్నాకు చేరుకుంటాయి. అప్పుడు విక్రమ్ ల్యాండర్ తనకు అనువైన ప్రాంతం కోసం వెతుకుతుంది.
ఈ క్రమంలో ల్యాండర్ మరింత కిందకు దిగి చందమామకు కేవంల 150 మీటర్ల ఎత్తుకు దిగుతుంది. ఈ టైంలో మరోసారి ల్యాండింగ్ కోసం గుంటలు లేని, బండరాళ్లు లేని సమాంతర సరైన ప్రదేశం కోసం అన్వేషిస్తుంది. ల్యాండింగ్ కు అన్నీ అనుకూలంగా కన్పిస్తే రెండు ఇంజిన్ల సాయంతో ల్యాండర్ జాబిల్లిపై పూర్తిగా దిగుతుంది. అప్పుడు విక్రమ్ ల్యాండర్ పోల్స్ సెకనుకు 3 మీటర్ల వేగంతో చంద్రుడి ఉపరితలాన్ని టచ్ చేస్తాయి. విక్రమ్ ల్యాండర్ పోల్స్ కు అమర్చిన సెన్సర్లు చంద్రుడి ఉపరితలాన్ని నిర్ధారించుకున్న తర్వాత రెండు ఇంజిన్లు ఆఫ్ అవుతాయి. ఇదిగో ఇదంతా అనుకున్నట్లు జరిగితే ఈ 17 నిమిషాల ఉత్కంఠకు తెరపడి చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అయినట్టే.
ఇక ల్యాండర్ జాబిల్లిపై దిగిన తర్వాత దాని ఒక తలుపు ఓపెన్ అవుతుంది. అందులో నుంచి రోవర్ మెల్లగా జారుతూ చంద్రుడిపైకి వస్తుంది. ఇంకేముంది అది తన పని మొదలుపెట్టి.. చందమామ ఉపరితలంపై పరిశోధనలు చేస్తుంది. అక్కడి నుంచి అది సూర్య కాంతిని ఉపయోగించుకుని మొత్తం 14 రోజుల పాటు చంద్రుడిపై పరిశోధనలు చేస్తుంది. ఐతే చంద్రుడి దక్షిణ ధృవంపై సూర్యుడి కాంతిని బట్టి మరి కొన్ని రోజులు మనుగడ సాగించే అవకాశం లేకపోలేదని అంతరిక్షరంగ నిపుణులు చెబుతున్నారు. ISRO Moon Mission