తన అభిమానికి సర్ ప్రైజ్ ఇచ్చిన కేటీఆర్
అభిమాని ఇంటికి వెళ్లి భోజనం చేసిన కేటీఆర్
హైదరాబాద్ రిపోర్ట్- మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటమి తరువాత నిరంతరం పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తన అభిమాని ఇంటికి వెళ్లి ఆశ్చర్యపరిచారు. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 2న హైదరాబాద్లోని బోరబండ బంజారానగర్కు చెందిన ఇబ్రహీంఖాన్ ట్విట్టర్ ద్వార కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపాడు. అంతే కాదు తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలని కేటీఆర్ ను కోరాడు. ఇబ్రహీంఖాన్ ఆహ్వానాన్ని మన్నించిన కేటీఆర్ ఆదివారం ఆయన ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. దీంతో ఇబ్రహీంఖాన్ తో పాటు కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. దివ్యాంగులైన తమ పిల్లలకు గతంలో ఆసరా పింఛను ఇప్పించాలని ట్విటర్లో చేసిన విజ్ఞప్తికి కేటీఆర్ కార్యాలయం వెంటనే స్పందించి మంజూరు చేయించిందని ఈ సందర్భంగా ఇబ్రహీంఖాన్ గుర్తుచేసుకున్నారు. అంతే కాదు తన పిల్లల చికిత్సకు అవసరమైన సహకారం అందించేందుకు కేటీఆర్ హామీ ఇచ్చారని చెప్పారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందించిన సేవలను గుర్తిస్తూ ఓ సాధారణ పౌరుడు తనను ఇంటికి ఆహ్వానించడం తనకు ఎంతో సంతోషం కలిగించిందని కేటీఆర్ అన్నారు.