ప్రపంచ అథ్లెటిక్స్లో స్వర్ణం నెగ్గిన తొలి భారతీయుడు
ప్రపంచ ఛాంపియన్ నీరజ్ చోప్రా
స్పోర్ట్స్ రిపోర్ట్- ప్రపంచ అథ్లెటిక్స్లో (World Athletics Championships 2023) స్వర్ణం నెగ్గిన మొట్టమొదటి భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు నీరజ్ చోప్రా (Neeraj Chopra) సాధించాడు. ఈ ఒలింపిక్ ఛాంపియన్, ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్ కూడా అయ్యాడు. రోజు రోజుకీ అంచనాలను పెంచుతూ ప్రపంచ అథ్లెటిక్స్లో తనదైన ముద్ర వేస్తున్న నీరజ్ చోప్రా.. మరో గొప్ప ఘనతను సాధించారు. ఆదివారం 88.17 మీటర్ల త్రో తో నీరజ్ చోప్రా పురుషుల జావెలిన్ త్రో విజేతగా నిలిచాడు. పాకిస్థాన్ త్రోయర్ అర్షద్ నదీమ్ (Arshad Nadeem) (87.82) రజతం నెగ్గగా, చెక్ కు చెందిన వద్లెచ్ (86.67) కాంస్యం చేజిక్కించుకున్నాడు. నీరజ్ చోప్రా గెలిచిన ఈ స్వర్ణం, ప్రపంచ అథ్లెటిక్స్లో ఇండియాకు లభించిన మూడో పతకం మాత్రమే. అంతకు ముందు 18 ఛాంపియన్ షిప్స్లో భారత్ కు కేవలం రెండు పతకాలు మాత్రమే వచ్చాయి.
మహిళల లాంగ్ జంప్లో అంజు బాబి జార్జ్ (anju bobby george) 2005 లో కాంస్యం సాధించగా.. గత యేడాది ఛాంపియన్షిప్స్లో నీరజ్ చోప్రా రజతం సాధించాడు. ఆదివారం మొదటి ప్రయత్నంలో ఫౌల్ చేసిన నీరజ్.. రెండో త్రోను 88.17 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానానికి చేరుకున్నాడు. మూడోసారి 86.32 మీటర్లు విసరగా, 87.82 త్రోతో పాక్ జావెలియన్ త్రోయర్ అర్షద్ నదీమ్ రెండో స్థానానికి చేరుకున్నాడు. నాలుగో ప్రయత్నంలో నీరజ్ 84.64 మీటర్లు త్రో చేశాడు. ఆ తర్వాత వరుసగా 87.73మీటర్లు, 83.98 మీటర్లు విసిరాడు. దీంతో రెండో త్రోనే నీరజ్ అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. ప్రపంచ అథ్లెటిక్స్లో తనదైన ముద్ర వేస్తున్న నీరజ్ చోప్రా మరో గొప్ప ఘనతను సొంతం చేసుకున్నాడు.