టమాటాలతో తులాభారం - అనకాపల్లిలో విచిత్రం
ఆంద్రప్రదేశ్- టమాటా (Tomatoes) ధర రోజు రోజుకు పెరిగిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా టమాటా ధర ఆకాశాన్నంటుతోంది. చాలా వరకు సామాన్య, మధ్య తరగతి వారు టమాటా కూర చేసుకోవడం, ఇతర కూరల్లో టమాటాలు వేయడమే మానేశారు. ఇదిగో ఇటువంటి సమయంలో అనకాపల్లి (Anakapalli) లో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని నూకాలమ్మ ఆలయంలో ఆదివారం ఒకరు టమాటాలతో తులాభారం ఇచ్చారు.
పట్టణానికి చెందిన మళ్ల జగ్గ అప్పారావు, మోహిని దంపతుల కుమార్తె భవిష్య తులాభారం ఆలయ ఆవరణలో నిర్వహించారు. ముందుగా 51 కేజీల టమాటాలతో, తర్వాత బెల్లం, పంచదారతో తురాభారం నిర్వహించారు. వీటిని అమ్మవారి నిత్యాన్నదానంలో ఉపయోగిస్తామని దేవస్థానం అధికారులు చెప్పారు. ప్రస్తుతం మార్కెట్ లో టమాటాల కిలో120 రూపాయల నుంచి 150 రూపాయల వరకు ధర పలుకుతున్న ఇటువంటి టైంలో టమాటాలతో తులాభారం నిర్వహించడం చర్చనీయాంశమవుతోంది.