Rahul Gandhi

ప్రత్యేకంగా వాటి కోసమే గోవా వెళ్లిన రాహూల్

గోవా వెళ్లి పెంపుడు కుక్క పిల్లలను కొన్న రాహూల్ గాంధీ

నేషనల్ రిపోర్ట్- కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత (Congress), ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) రెండు కుక్క పిల్లలను (Puppies) కొనుగోలు చేశారు. గోవా (Goa) పర్యటనలో షేడ్స్‌ కెన్నెల్‌ (Shades Kennel) అనే పెంపుడు జంతువుల విక్రయ సంస్థను సందర్శించిన రాహూల్ గాంధీ.. అక్కడ జాక్‌ రస్సెల్ టెర్రియర్‌ (Jack Russell Terrier) జాతికి చెందిన ఒక మగ, ఒక ఆడ కుక్క పిల్లలను పెంచుకోవడానికి తీసుకున్నారు. ఈ కుక్క పిల్లలను తీసుకుపోవడానికి ప్రత్యేకంగా ఆయన గోవా వెళ్లినట్లు ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి. తనకు నచ్చిన కుక్క పిల్లలను కొనుగోలు చేసిన తర్వాత విమానయాన నిబంధనల కారణంగా రాహూల్ గాంధీ ఒక కుక్క పిల్లను మాత్రమే తనతో ఢిల్లీ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

రాహుల్‌ గాంధీకి పెంపుడు జంతువులంటే చాలా ఇష్టమని, భారత్‌ జోడో యాత్రలో కూడా ఆయన వాటితో కొంత సమయం గడిపేవారని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయన సన్నిహిత నాయకుడు ఒకరు చెప్పారు. ఇక రాహుల్ గాంధీ కొనుగోలు చేసిన కుక్కపిల్లలకు సంబందించిన వివరాలను షేడ్స్‌ కెన్నెల్‌ నిర్వాహకురాలు శర్వాణి పిత్రే తెలిపారు. రాహుల్‌ గాంధీ కార్యాలయ సిబ్బంది ముందు ఇక్కడ ఆ జాతి కుక్కలు అందుబాటులో ఉన్నాయా అనే విషయం గురించి  ఫోన్‌ లో సంప్రదించారని ఆమె చెప్పారు. అందుబాటులో ఉన్నాయని తెలిసి ఆయనే స్వయంగా తీసుకెళ్లడానికి వచ్చారని ఆమె వివరించారు. ఇక ఈ కుక్కపిల్ల ఆహార్యం చిన్నగా కన్పించినా, అవి చాలా తెలివిగా వ్యవహరిస్తాయని ఆమె తెలిపారు. ఐతే వీటి ధర మాత్రం వెల్లడించలేదు.
 


Comment As:

Comment (0)