ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీం కోర్టు..
అమరావతి-న్యూ ఢిల్లీ స్పాట్ న్యూస్- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి (YS Jagan) సుప్రీం కోర్టు (Supreme Court) షాకిచ్చింది. అక్రమ ఆస్తుల కేసులో (Illegal Assets Case) సీఎం జగన్ కు సంబంధించిన క్యాంపెనీలకు సుప్రీం కోర్టు ధర్మాసనం నోటీసులు (Notices) జారీ చేసింది. భారతి సిమెంట్స్ (Bharati Cements), జగతి పబ్లికేషన్స్ (Jagati Publications), వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి లకు (Vijayasai Reddy) ఈ మేరకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.
జగన్ అక్రమాస్తుల కేసులో ముందు సీబీఐ (CBI) కేసులు విచారించాలని, అప్పటి వరకు ఈడీ (ED) రిజిస్టర్ చేసిన కేసుల విచారణ ఆపాలని ట్రయల్ కోర్టును (Trial Court) తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఆదేశించింది. సీబీఐ ఛార్జిషీట్లపై తీర్పు వెలువడిన తర్వాతే ఈడీ కేసుల విచారణ చేపట్టాలని స్పష్టం చేసింది. ఒకవేళ సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల విచారణ సమాంతరంగా జరిపితే, సీబీఐ కేసులపై తీర్పు తర్వాతే.. ఈడీ కేసులపై తీర్పు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ (Justice Ujjal Bhuyan) ధర్మాసనం ఆదేశించింది.
జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులు, ఈడీ నమోదు చేసిన కేసులు సమాంతరంగా విచారణ కొనసాగించవచ్చని గతంలో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం కొట్టిసింది. హైదరాబాబ్ సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తుది ఆదేశాలపై 2021లో తెలంగాణ హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. దీంతో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఈడీ సుప్రీం కోర్టులో సవాలు చేసింది.
ఈడీ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ సంజయ్ కరోల లతో కూడిన ధర్మాసనం సెప్టెంబర్ 5వ తేదీలోపు సమాధానం చెప్పాలని ప్రతివాదులుగా ఉన్న విజయసాయిరెడ్డి, భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్లకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు పూర్తి స్థాయి విచారణ సుప్రీం కోర్టులో ద్విసభ్య ధర్మాసనం చేపట్టాలా, లేక త్రిసభ్య ధర్మాసనం చేపట్టాలా అన్నది ఆరోజు నిర్ణయిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 5వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు ఏపీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి రెడ్డిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై.. ఈ కేసులతో జత పరిచి ఉన్న పిటిషన్ ను విడిగా విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీం కోర్టు తాజా నోటిసులతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.