జగన్ పోవాలి.. జనసేని రావాలి
జగన్ పోవాలి.. జనసేని రావాలి - పవన్ కళ్యాణ్
పొలిటికల్ న్యూస్-ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వారాహి యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన పబ్లిక్ మీటింగ్ లో పవన్ మాట్లాడారు. ప్రాథమిక సౌకర్యాలు లేకపోతేనే ప్రజలు ఉద్యమాలు చేస్తారని ఈ సందర్బంగా ఆయన అన్నారు. అవినీతి, దోపిడీయే లక్ష్యంగా కొందరు నేతలు పరిపాలన సాగిస్తున్నారంటూ వైసీపీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ఎవరో ఒకరు మొదలు పెట్టకపోతే సమాజంలో మార్పురాదని, ఆ బాధ్యతను జనసేన తీసుకుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి జగన్ తో పాటు మంత్రులు రాష్ట్రాన్ని, వనరులను దోపిడీ చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన నేతల స్ఫూర్తితో పరిపాలన జరగాలని అన్నారు. ప్రజలు ఎంతో కష్టాలు పడి పన్నులు కడుతుంటే, వాటిని కొందరు నేతలు దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. కానీ ఇప్పుడు రోజులు మారాయని, మాటలతో మోసం చేయలేమని సీఎం గ్రహించాలని పవన్ కల్యాణ్ హితువు పలికారు.
వచ్చే ఎన్నికల్లో గెలిచి జనసేన అధికారంలోకి వచ్చాక అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. గోదావరి జిల్లాలను దత్తత తీసుకుంటానని, అన్యాయం జరిగిన వర్గాలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వచ్చే పాతికేళ్లు ఈ నేల కోసం గొడ్డు చాకిరీ చేస్తానని, మాస్టర్ ప్లాన్ తయారు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. గోదావరి జిల్లాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తానన్న పవన్.. అభివృద్ధి జరగాలంటే.. జగన్ పోవాలని.. జనసేన రావాలని కామెంట్ చేశారు. ఈ సభలో పవన్ అభిమానులు, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.