నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి
కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో కేసీఆర్ పూజలు
సిద్దిపేట రిపోర్ట్- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి (Konaipally Venkateswara Swamy Temple) వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి వెంకన్నను దర్శించుకున్నారు. ఆలయంలో ఈ ఎన్నికల్లో దాఖలు చేయబోయే నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ ప్రతి ఎన్నికల సందర్భంగా నామినేషన్ వేయడానికి ముందు కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించడం ఆనవాయితీగా వస్తోంది.
గజ్వేల్ తో పాటు కామారెడ్డి నియోజకవర్గానికి తాధలు చేయనున్న నామినేషన్ పత్రాలతో ఆలయంలో ప్రత్యేక పూజలుచేసి విజయాన్ని ప్రసాదించాలని ఆయన కోరుకున్నారు. ఉదయం ఎర్రవల్లి ఫామ్ హౌజ్ నుంచి రోడ్డుమార్గం ద్వారా కోనాయపల్లి గ్రామానికి చేరుకునన్న సీఎం కేసీఆర్, ముందుగా వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. నామినేషన్ పత్రాలను వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 9న ఉదయం గజ్వేల్లో, మధ్యాహ్నం కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. కేసీఆర్ వెంట మంత్రి హరీశ్ రావు తదితరులు ఉన్నారు.