ఆరు గ్యారంటీల్లో రెండు పథకాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి
100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం - సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ రిపోర్ట్- ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెప్పారు. ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి సంబందించిన మహాలక్ష్మి పథకాన్ని, ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచే మరో పథకాన్ని సీఎం అసెంబ్లీ ఆవరణలో లాంఛనంగా ప్రారంభించారు. అసెంబ్లీ సమావేశాల తరువాత అక్కడే ప్రాంగనంలో జరిగిన కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ లోగో, పోస్టర్ లను ఆవిష్కరించారు రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో.. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీఎస్ శాంతికుమారి, ఆర్టీసీ (TSRTC) ఎండీ సజ్జనార్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ.. ఇవాళ తెలంగాణ ప్రజలకు పండగ రోజని అన్నారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని.. తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం కనిపిస్తుందని చెప్పారు. నాది తెలంగాణ అని చెప్పే అవకాశం మనకు సోనియమ్మ ఇచ్చారన్న రేవంత్ రెడ్డి.. ఇక్కడి ప్రజల కోసమే సోనియమ్మ ఆరు గ్యారంటీలను ఇచ్చారని అన్నారు. ఇవాళ ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను అమలు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని సీఎం స్పష్టం చేశారు. మహిళలు ఈరోజు నుంచి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున బాక్సర్ నిఖత్ జరీన్కు 2 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు సీఎం.