చంద్రబాబు రిమాండ్ను పొడగించిన ఏసీబీ కోర్టు
నా భద్రతపై అనుమానాలున్నాయి- ఏసీబీ కోర్టుకు తెలిపిన చంద్రబాబు
అమరావతి రిపోర్ట్- ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) జ్యుడీషియల్ రిమాండ్ ను విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court) పొడిగింది. గతంలో విధించిన రిమాండ్ ఈ రోజు గురువారంతో ముగియడంతో రాజమహేంద్రవరం జైలు అధికారులు చంద్రబాబును వర్చువల్గా ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. అనంతరం చంద్రబాబు రిమాండ్ను (Chandrababu Remand) నవంబర్ 1 వరకు పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది.
ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోగ్యంపై జడ్జి ఆరా తీశారు. చంద్రబాబు ఆరోగ్యానికి సంబందించిన మెడికల్ రిపోర్టులను అందివ్వాలని అధికారులను ఆదేశించారు. ఐతే తన భద్రత విషయంలో అనుమానాలున్నాయని చంద్రబాబు ఏసీబీ కోర్టు దృష్టికి తెచ్చారు. భద్రత విషయంలో అనుమానాలుంటే రాత పూర్వకంగా ఇవ్వాలని ఆయనకు కోర్టు సూచించింది. చంద్రబాబు కోర్టుకు రాసే లేఖను తనకు అందివ్వాలని జైలు అధికారులను ఏసీబీ కోర్టు జడ్జి ఆదేశించారు.