ఈనెల 23న చంద్రుడిపైన దిగనున్న ల్యాండర్
చందమామకు మరింత దగ్గరగా చంద్రయాన్-3
నేషనల్ రిపోర్ట్- చందమామపై పరిశోధనలు చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రయోగించిన చంద్రయాన్-3 (Chandrayaan-3) నేటితో (ఆగష్టు 14-సోమవారం) నెల రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చంద్రుడి చుట్టూ తిరుగుతున్న చంద్రయాన్-3 వ్యౌమనౌక, ఈ రోజు చంద్రుడికి మరింత దగ్గరైంది. చంద్రయాన్-3 కక్ష్య తగ్గింపు ప్రక్రియను (Orbit Reduction Maneuver) సక్సెస్ ఫుల్ నిర్వహించినట్లు ఇస్రో తెలిపింది. బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ (ISTRAC) కేంద్రం నుంచి ఈ విన్యాసాన్ని చేపట్టినట్లు ఇస్రో ప్రకటించింది.
చందమామ చుట్టు పరిభ్రమించే విషయంలో చంద్రయాన్-3కి ఇది రెండో చివరి కక్ష్య అని చెప్పాలి. ఈ విన్యాసంతో వ్యౌమనౌక కక్ష్యను 150 కిలో మీటర్లు x 177 కిలో మీటర్లలకు తగ్గించినట్లు ఇస్రో పేర్కొంది. ఆగస్టు 16న ఉదయం 8.30కు తదుపరి కక్ష్య తగ్గింపు ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిపింది. దీంతో చంద్రయాన్-3 అంతరిక్ష నౌక చంద్రుడిపై 100 కిలోమీటర్ల ఎత్తున ఉన్న కక్ష్యలోకి చేరుకోనుంది. ఆ తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండింగ్ మాడ్యూల్ విడిపోతుంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ నెల 23 సాయంత్రం ల్యాండర్ చందమామపై దిగుతుంది.
జులై 14న ఎల్వీఎం3-ఎం4 రాకెట్ ద్వారా చంద్రయాన్-3 వ్యామోనౌకను సక్సెస్ ఫుల్ గా భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో.. మరుసటిరోజు తొలిసారి దీని కక్ష్యను పెంచింది. ఇలా 18 రోజుల వ్యవధిలో దశలవారీగా మొత్తం ఐదుసార్లు చంద్రయాన్-3 కక్ష్యను పెంచుతూ వచ్చారు. ఐదో భూకక్ష్య పూర్తయిన తరువాత చందమామ దిశగా ప్రయాణానికిగానూ ఆగస్టు 1న ట్రాన్స్ లూనార్ కక్ష్య (Lunar Orbit Injection) లోకి ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా చంద్రయాన-3ను చేర్చారు. క్రమంగా కక్ష్యలను తగ్గిస్తూ చంద్రుడికి చేరువ చేశారు. ఆగష్టు 23న సాయంత్రం చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రుడి దక్షిణధ్రువంపై దిగి, 14 రోజుల పాటు పరిశోధనలు చేయనుంది.