బైడెన్ కాన్వాయ్ లోని ఓ డ్రైవర్ ప్రవర్తన అనుమానాస్పదం
ముగిసిన జో బైడెన్ భారత్ టూర్- వియత్నాం బయల్దేరిన బైడెన్
న్యూ ఢిల్లీ- భారత పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden), ఢిల్లీలో రెండు రోజులపాటు జరిగిన జీ20 సదస్సు (G20 summit 2023)ను ముగించుకొని వియత్నాం బయల్దేరి వెళ్లారు బైడెన్. ఆదివారం ఉదయం రాజ్ఘాట్ లో మహాత్మ గాంధీ సమాధి వద్ద జీ20 ప్రతినిధులతో కలిసి బైడెన్ నివాళి అర్పించారు. ఆ తరువాత ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకొన్నారు. అక్కడి నుంచి తన ఎయిర్ ఫోర్స్వన్ విమానంలో వియత్నాం బయల్దేరి వెళ్లారు. బైడెన్ అమెరికా అధ్యక్ష్య బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ లో మొదటిసారి పర్యటించారు. శుక్రవారం సాయంత్రం మొదలైన బైడెన్ పర్యటనలో మొదటి రోజు ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు.
ఇక జో బైడెన్ కాన్వాయ్ లో ఓ డ్రైవర్ ను శనివారం రాత్రి భద్రతా దళాలు అదుపులోకి తీసుకొన్నాయి. అతడి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో అతడిని అదుపులోకి తీసుకున్న భద్రతా దళాలు ప్రశ్నించాయి. బైడెన్ కాన్వాయ్ లోని కొన్ని వాహనాలు అమెరికా నుంచి రాగా, మరికొన్ని వాహనాలను భారత్ లోనే కేటాయించారు. వీటిల్లో కొన్ని వాహనాలను రెంట్ కు తీసుకోగా, అందులో ఓ కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బసచేసే హోటల్ ఐటీసీ మౌర్యా వద్ద ఉండాల్సిన ఆ వాహనం, యూఏఈ పాలకుడు అల్ నహ్యాన్ బస చేస్తున్న తాజ్ హోటల్ వద్ద అనమానాస్పదంగా కనిపించింది. ఐతే ఓ వ్యాపారవేత్తను అక్కడ డ్రాప్ చేసేందుకు తాను వచ్చానని సదరు డ్రైవర్ అధికారులకు వివరించాడు. ప్రొటో కాల్ గురించి తనకు తెలియదని.. కేవలం పొరపాటు వల్లే ఇంది జరిగిందని చెప్పగా.. కొన్ని గంటలు ప్రశ్నించిన తర్వాత సంతృప్తి చెందిన భద్రతా దళాలు అతడిని విడిచిపెట్టాయి.