రాజకీయ కక్ష్యతోనే చంద్రబాబుపై కేసులు
ఢిల్లీలో నారా లోకేశ్.. రాజమహేంద్రవరంలో భువనేశ్వరి నిరశన దీక్ష
స్పెషల్ రిపోర్ట్- ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును (Chandrababu) అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఏపీతో పాటు తెలంగాణ వ్యాప్తంగా టీడీపీ నేతలు సత్యమేవ జయతే పేరుతో ఒక్కరోజు దీక్ష చేశారు. ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh), రాజమహేంద్రవరంలోని క్వారీ సెంటర్ దగ్గర చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Bhuvaneshwari) నిరశన దీక్షలో కూర్చొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ముందు నారా లోకేశ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం దీక్ష చేపట్టారు.
ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఇంట్లో ఏర్పాటు చేసిన వేదిక వద్ద లోకేశ్ దీక్ష చేశారు. ఈ దీక్షలో టీడీపీ ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. ఇక మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ముఖ్య నేతలు నిరసనదీక్ష చేశారు. అటు తెలంగాణలో టీడీపీ పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, తెలంగాణ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, ఎన్టీఆర్ ఘాట్ లో నందమూరి సుహాసిని నిరసన దీక్ష చేశారు.