హైదరాబాద్ లో యువతి దారుణ హత్య
ఆమెను శంషాబాద్లో హత్యచేసి.. సరూర్నగర్ లో పడేశాడు..
రంగారెడ్డి-శంషాబాద్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నవ్యక్తి, ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. హైదరాబాద్ లోని సరూర్నగర్ ప్రాంతానికి చెందిన వెంకట సాయికృష్ణ, అప్సర దగ్గరి బంధువులు. సాయికృష్ణకు ఇప్పటికే పెళ్లై, ఇద్దరు పిల్లలున్నారు. గత కొంత కాలంగా అప్సరతో సాయికృష్ణ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ నేపధ్యంలో తనను వివాహం చేసుకోవాలని అప్సర సాయికృష్ణపై కొన్ని రోజులుగా ఒత్తిడి చేస్తోంది. ఆమెను ఎలాగైనా ఒదిలించుకోవాలనుకున్న సాయికృష్ణ పధకం పన్నాడు. రెండు రోజుల క్రితం అప్సరను కారులో శంషాబాద్ లోని సుల్తాన్పల్లికి తీసుకెళ్లాడు సాయి కృష్ణ.
పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య మరోసారి రభస జరిగింది. దీంతో కోపం పట్టలేకపోయిన సాయికృష్ణ, అప్సర తలపై బండరాయితో మోది దారుణంగా హత్య చేశాడు. ఆ తరువాత తన కారులోనే ఆమె మృతదేహాన్ని సరూర్నగర్ కు తీసుకువచ్చి, స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ దగ్గర మ్యాన్హోల్ లో పడేశాడు. అక్కడి నుంచి శంషాబాద్ వెళ్లిపోయినా సాయికృష్ణ, మరుసటి రోజు తన బంధువు అప్సర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానం వచ్చిన పోలీసులు సాయికృష్ణ సెల్ ఫోన్ సిగ్నల్స్ తో పాటు, సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా కేసును ఛేదించారు. అప్సరను సాయికృష్ణ కిరాతకంగా చంపాడని నిర్ధారించారు. సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు, సరూరా నగర్ మ్యాన్ హోల్లో అప్సర డెడ్ బాడీని బయటకు తీశారు.