పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్న చిరంజీవి
న్యూ ఢిల్లీ రిపోర్ట్- మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పద్మవిభూషన్ (Padma Vibhushan) అవార్డు అందుకున్నారు. గురువారం రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన పద్మవిభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మెగా హీరో రామ్ చరణ్, ఉపాసనతో పాటు చిరంజీవి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. గతంలో కేంద్ర ప్రభుత్వం చిరంజీవిని పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.
సినీ పరిశ్రమకు చిరంజీవి చేసిన కృషికి గుర్తింపుగా దేశంలో రెండో అత్యున్నతమైన పద్మ విభూషణ్ పురస్కారాన్ని ఇటీవలే ప్రకటించింది కేంద్రప్రభుత్వం. ఇక ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చిరంజీవితో పాటు ప్రఖ్యాత నృత్యకారిణి, సీనియర్ నటీమణి వైజయంతిమాల బాలి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకోగా, సుప్రీం కోర్టు తొలి మహిళా జడ్జి దివంగత ఎం.ఫాతిమా బీవీ, హోర్ముస్జీ ఎన్.కామా పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు.