పసుపుబోర్డు పేరు చెప్పి ఎన్నాళ్లిలా మోసం చేస్తారు- సీఎం రేవంత్ రెడ్డి
నిజామాబాద్ రిపోర్ట్- హరియాణా, పంజాబ్ రైతులు ప్రధాని మోదీ మెడలు వంచి నల్లచట్టాలు రద్దు చేయించారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. నిజామాబాద్, ఆర్మూర్ రైతులు అదేబాటలో నడవాలని ఆయన పిలుపునిచ్చారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్ లో నిర్వహించిన రోడ్ షోలో బీజేపీ, బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసినప్పుడు ఇచ్చిన హామీలను ఆ తర్వాత మరిచారని మండిపడ్డారు.
నిజామాబాద్ జిల్లాకు పసుపుబోర్డు తెస్తానని చెప్పిన ఎంపీ ధర్మపురి అర్వింద్ సైతం మోసం చేశారని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. 2019లో రాజ్ నాథ్ సింగ్ను తీసుకొచ్చి పసుపు బోర్డుపై ప్రకటన చేయించిన అర్వింద్, ఇప్పుడు మోదీని తీసుకొచ్చి మళ్లీ అదే మాట చెప్పించారని అన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా మోదీ ఇలాగే హామీ ఇచ్చి కాలయాపన చేస్తారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. జీవన్ రెడ్డిని నిజామాబాద్ ఎంపీగా గెలిపిస్తే ఆర్మూర్ను అభివృద్ధిపథంలో ముందుంచుతానని ఈ సందర్బంగా సీఎం హామీ ఇచ్చారు. షుగర్ ఫ్యాక్టరీ తెరిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని, 42 కోట్ల బకాయిలు చెల్లించేందుకు నిధులు విడుదల చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.