చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేత
రంగారెడ్డి రిపోర్ట్- హైదరాబాద్ నగర శివారులోని శ్రీ చిలుకూరు బాలాజీ ఆలయంలో (Chilkur Balaji Temple) గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ప్రకటించారు. గరుడ ప్రసాద వితరణపై విస్తృత ప్రచారం జరిగిన నేపథ్యంలో శుక్రవారం బాలాజీ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచే వేలాదిగా భక్తులు పోటెత్తడంతో చిలుకూరు బాలాజీ ఆలయం పరిసరాలు భక్త జనసంద్రంగా మారిపోయాయి.
మరోవైపు బారీస్థాయిలో భక్తులు రావడంతో చిలుకూరు మార్గంలో ఉదయం సుమారు 10 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. నగరంలోని మాసబ్ట్యాంక్ నుంచి మొదలు మెహదీపట్నం, నానల్ నగర్, లంగర్ హౌస్, సన్సిటీ, అప్పా జంక్షన్ మీదుగా చిలుకూరు ఆలయం వరకు వాహనాలు నిలిచిపోయాయి. అటు గచ్చిబౌలిలోని ఔటర్ రింగ్ సర్వీస్ రోడ్డులో సైతం ట్రాఫిక్ స్థంబించింది. దీంతో కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు గంటల కొద్ది ట్రాఫిక్ లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్ది ట్రాఫిక్ ను క్లియల్ చేసే ప్రయత్నం చేశారు.
తెల్లవారుఝాము నుంచి ఉదయం 10.30 గంటల వరకు సుమారు 60వేలకు పైగా భక్తులు చిలుకూరప బాలాజి ఆలయానికి వచ్చారని మెయినాబాద్ పోలీసులు చెప్పారు. కేవలం 5వేల మంది భక్తులు వస్తారని దేవస్థానం నిర్వాహకులు చెప్పిన మేరకు అంచనా వేసి బందోబస్తు ఏర్పాటు చేశామని, కానీ ఊహించిన దాని కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు రావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తినట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు గరుడ ప్రసాదం పంపిణీపై చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ స్పందించారు. సంతాన భాగ్యం కోసం వచ్చిన చాలా మంది భక్తులకు గరుడ ప్రసాదం పంపిణీ చేశామని చెప్పారు. ఐతే తాము ఊహించిన దానికంటే వెయ్యి రెట్లు భక్తులు రావడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయని రంగరాజన్ వివరణ ఇచ్చారు. ఈ పరిస్థితుల నేపధ్యంలో ఆలయంలో గరుడ ప్రసాదం వితరణ నిలిపివేశామని ఆయన ప్రకటించారు.