32 చోట్ల పోటీ చేయనున్నట్లు ప్రకటించిన జనసేన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్దమైన జనసేన
హైదరాబాద్ రిపోర్ట్- తెలంగాణ (Telangana) శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన (Janasena) పార్టీ నిర్ణయించింది. రాష్ట్రంలో మొత్తం 32 చోట్ల పోటీ చేయనున్నట్టు జనసేన ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణలో పోటీచేసే స్థానాల జాబితాను సోమవారం సాయంత్రం విడుదల చేసింది జనసేన. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడమే తమ పార్టీ లక్ష్యమని జనసేన తెలంగాణ శాఖ స్పష్టం చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ అంశంపై పక్కా ప్రణాళికతో ఉన్నామని జనసేని తెలంగాణ ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్ రెడ్డి చెప్పారు. చివరి క్షణంలో పొత్తులేమైనా ఉంటే ఈ 32 స్థానాల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చని ఆయన తెలిపారు.
ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, పటాన్చెరు, సనత్నగర్, కూకట్పల్లి, ఉప్పల్, మల్కాజిగిరి, మేడ్చల్, నాగర్కర్నూల్, ఖమ్మం, వైరా, మునుగోడు, కొత్తగూడెం, అశ్వారావుపేట, పాలకుర్తి, నర్సంపేట, పాలేరు, ఇల్లందు, మధిర, స్టేషన్ఘన్పూర్, హుస్నాబాద్, రామగుండం, జగిత్యాల, నకిరేకల్, హుజూర్నగర్, మంథని, కోదాడ, సత్తుపల్లి, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయించింది.
తెలంగాణలో సుమారు 25 సీట్లలో పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉందని జనసేని తెలిపింది. గెలుపోటములు నిర్ణయించే స్థాయిలో తమ ఓటింగ్ ఉందని, గత ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికే ఇందుకు ఉదాహరణ నేతలు చెబుతుననారు. గత పదేళ్లలో తెలంగాణలో అనేక సమస్యలపై జనసేన పోరాటం చేసిందని గుర్తుచేస్తున్నారు. యువత, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) జనసేన ను స్థాపించారని స్పష్టం చేశారు.