హిమాన్షు మాటల్లో తప్పేముంది - ఎమ్మెల్యేలను కొనడంలో రేవంత్ కు సాటిలేరు- కేటీఆర్
తెలంగాణ స్పెషల్ రిపోర్ట్- తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ పార్టీపై, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మంండిపడ్డారు. ఐదు దశాబ్దాల పాటు దేశ ప్రజలను కాంగ్రెస్ రాచి రంపాన పెట్టిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. జగిత్యాలలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి మాటలు అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. రేవంత్ రెడ్డి రైతులపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని వెంటనే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ హయాంలో రైతులకు కరెంటు, విత్తనాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేదని.. విత్తనాలు, ఎరువుల కోసం చెప్పుల్ని లైన్లో పెట్టి నిల్చున్నది నిజం కాదా అని నిలదీశారు. కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణలో రైతుల పరిస్థితి మారిపోయిందని ఈ సందర్బంగా కేటీఆర్ చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రైతుల్ని రాజుగా చేసిన పార్టీ బీఆర్ఎస్ మాత్రమేన్న కేటీఆర్, మూడెకరాలున్న రైతులకు 3 గంటల విద్యుత్ చాలన్న రేవంత్ రెడ్డి మాటలు పార్టీ మాటలు కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ ది 3 పంటల నినాదమైతే కాంగ్రెస్ది మూడు గంటల నినాదమని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ప్రజలు రైతుబంధు ఇస్తున్న కేసీఆర్ను విశ్వసిస్తారా లేదా కాంగ్రెస్ని నమ్ముతారా అని కేటీఆర్ ప్రశ్నించారు. గతంలో ఏ చెరువునైనా నింపిన చరిత్ర కాంగ్రెస్కు ఉందా అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని రాహుల్ గాంధీ అంటున్నారని, అదెలా జరిగిందో చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇక తన తనయుడు హిమాన్షు మాట్లాడిన మాటల్లో తప్పులేదన్న కేటీఆర్, ప్రతి పాఠశాలని కేసీఆర్ ప్రభుత్వమే బాగు చేస్తుందని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు.