టీడీపీ, జనసేన పొత్తుపై పవన్ కళ్యాణ్ ప్రకటన
ఏపీ రాజకీయాల్లో పొత్తు పొడిచింది..
రాజమహేంద్రవరం రిపోర్ట్- ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అందుకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వేధికైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటి నుంచీ ఎన్నికల ఫలితాలకు దిశానిర్దేశం చేసే గోదావరి తీరం మరో చరిత్రాత్మక నిర్ణయానికి సాక్ష్యం అయ్యింది. తెలుగుదేశం (Telugudesham), జనసేనల (Janasena) పార్టీల మధ్య ఇంత కాలం ప్రాథమిక చర్చల దశలోనే ఉన్న ఎన్నికల పొత్తు ఖరారైంది. ఈ పరిణామంతో రెండు పార్టీల శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహం నెలకొంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కలిసి పని చేయనున్నాయని చాలా కాలంగా చర్చ జరుగుతున్నా.. అందుకు సంబందంచిన స్పష్టత మాత్రం కొరవడుతూ వస్తోంది. ఇదిగో ఇటువంటి సమయంలో టీడీపీ, జనసేన మధ్య పొత్తుపై అధికారిక ప్రకటన వచ్చేసింది.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గురువారం రాజమహేంద్రవరంలో టీడీపీ అధినేత చంద్రబాబును (Chandrababu) కలిసి సంఘీభావం ప్రకటించారు. ఆ తరువాత నారా లోకేశ్, బాలకృష్ణలతో కలిసి పొత్తుపై స్పష్టమైన ప్రకటన చేశారు. ఎవరు వచ్చినా, రాకపోయినా టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై జగన్ సర్కార్ అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసిందని రగిలిపోతున్న పార్టీ శ్రేణుల్లో ఇప్పుడు జనసేన కూడా కలిసిరావడం బలాన్ని నిపింది. జనసేన కలవడంతో అగ్నికి వాయువు తోడైనట్టయిందన్న టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు జనసేన కేడర్ లోనూ సిద్ధాంతపరంగా సారూప్యం ఉన్న ప్రధాన పార్టీతో కలిసి పనిచేయాలన్న కోరిక నెరవేరనుందన్న ఉత్సాహం కనిపిస్తోంది. టీడీపీ, జనసేని పొత్తుపై పూర్తి స్పష్టత రావడంతో వచ్చే ఎన్నికల్లో తమకు తిరుగులేదన్న, అధికారంలోకి రావడం ఖాయమన్న నమ్మకంతో ఉన్నాయి.