చంద్రబాబుతో 2 గంటల పాటు భేటీ అయిన పవన్
టీడీపీ అధినేత చంద్రబాబును పరామర్శించిన పవన్ కల్యాణ్
హైదరాబాద్ రిపోర్ట్- తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును (Chandrababu) జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పరామర్శించారు. శనివారం సాయంత్రం జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ తో కలిసి జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల సమావేశం సుమారు 2గంటల పాటు కొనసాగగా, ఈ బేటీలో వివిధ అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.
గత నెల అక్టోబరు 31న రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విడుదలైన చంద్రబాబు వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ వచ్చారు. శుక్రవారం గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ లో వైద్యులు చంద్రబాబుకు అన్ని రకాల రక్త పరీక్షలతో పాటు గుండె, ఊపిరితిత్తులు, చర్మ అలర్జీకి సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. ఇక ఈ రోజు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో కంటి పరీక్షలు చేయించుకున్నారు చంద్రబాబు. మంగళవారం చంద్రబాబు కుడి కంటిని ఆపరేషన్ చేయనున్నారు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వైద్య బృందం.