స్థలం కబ్జా చేశారంటూ ఎన్ఆర్ఐ మహిళ ఫిర్యాదు
బీఆర్ఎస్ ఎంపీ కేకే కుమారులపై పోలీసు కేసు
హైదరాబాద్ క్రైం రిపోర్ట్- బీఆర్ఎస్ రాజ్య సభ సభ్యుడు కె.కేశవరావు (కేకే) ఇద్దరు కుమారులపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైందన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లోని ఎన్బీటీనగర్ సర్వే నంబరు 129..కొత్త సర్వేనంబరు 403 లో షేక్ అలీఖాన్ అహ్మద్ నుంచి 939 గజాల స్థలాన్ని బంజారాహిల్స్కు చెందిన పి.సుదర్శన్ రెడ్డి 470 గజాలు, బంజారాహిల్స్ రోడ్ నంబరు 13లో నివసించే జయమాల 469 గజాల స్థలాన్ని 1983లో జాయింట్ గా కొన్నారు.
సుదర్శన్రెడ్డి దక్షిణం, జయమాల ఉత్తరం వైపు భాగాలు తీసుకున్నారు. తర్వాత జయమాల అమెరికాలో స్థిరపడింది. బంజారాహిల్స్ రోడ్ నంబరు 13లోని జయమాల నివసించిన ఇంటికి గతేడాది ఆదాయపు పన్ను శాఖ నోటీసు జారీ చేసింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 2,13,67,500 లకు స్థలాన్ని విక్రయించారని, పెట్టుబడి మీద వచ్చిన లాభానికి సంబంధించి చెల్లించాల్సిన పన్ను, పెనాల్టీ.. 1,40,41,300 చెల్లించాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో ఆమె కొన్నిరోజుల క్రితం నగరానికి వచ్చింది. 2019లో ఎంపీ కె.కేశవరావు కుమారుడు తెలంగాణ స్టేట్ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ విప్లవ్ కుమార్ కు స్థలంపై అధికార హక్కులతో కూడిన స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ తాను ఇచ్చినట్లు ఉన్న పత్రాలు జయమాల గమనించి అవాక్కైంది.
జులై 19, 2013లో ఆ స్థలాన్ని తన సోదరుడు కె.వెంకటేశ్వర్ రావు అలియాస్ వెంకట్కు 3 లక్షలకు విక్రయించిన రిజిస్టర్ దస్తావేజులను ఆమె గుర్తించింది. వీటిలో తన సంతకాలు ఫోర్జరీ చేసినట్లు గుర్తించింది. దీనిపై పోలీస్స్టేషన్కు వెళ్లినా ఫలితం లేకపోవడంతో ఇటీవల మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ను జయమాల ఆశ్రయించింది. గతనెల 13న న్యాయస్థానం ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో కె.కేశవరావు కుమారులు విప్లవ్కుమార్ ఎ-1, వెంకటేశ్వర్రావును ఎ-2గా చేర్చారు. దీనిపై సమగ్ర విచారణ జరుపుతామని పోలీసులు చెబుతున్నారు.