సుప్రీం కోర్టును ఆశ్రయించిన రాహూల్ గాంధీ
న్యూ ఢిల్లీ- అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court) ను ఆశ్రయించారు. మోదీ (Modi) ఇంటి పేరు వ్యాఖ్యల కేసులో ఆయనకు గుజరాత్ (Gujarath) లోని సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన నేపధ్యంలో, అనర్హత వేటుతో రాహూల్ ఎంపీ పదవిని కోల్పోయారు. ఈ శిక్షపై స్టే విధించాలంటూ ఆయన గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా, అక్కడా ఆయనకు ఎదురు దెబ్బ గిలింది. అందుకే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు..
కర్టాటక (Karnataka) లో 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కోలార్ లో జరిగిన ర్యాలీలో మోదీ అనే పదం ప్రస్తావన తెచ్చి ఇంటి పేరు ఉన్నవాళ్లంతా దొంగలే అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ పరువు నష్టం దావా వేశారు. ఈ ఏడాది మార్చి 23న సూరత్ కోర్టు ఈ క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేలుస్తూ రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
సూరత్ కోర్టు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన మరుసటి రోజు అంటే మార్చి 24వ తేదీన రాహూల్ గాంధీ లోక్ సభ స్థానంపై అనర్హత వేటు పడింది. ప్రజా ప్రాతినిథ్య చట్టం 1951 బలమైన సెక్షన్ 8 ప్రకారం ఆయనపై వేటు వేసినట్లు లోక్సభ కార్యదర్శి ప్రకటించారు. తక్షణం వేటు అమలులోకి వస్తుందని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
ఈ క్రమంలో సూరత్ కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్న రాహుల్ గాంధీ తన శిక్షపై స్టే విధించడం ద్వారా లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే సూరత్ సెషన్స్ కోర్టు ఆయన శిక్షపై స్టే విధించేందుకు అంగీకరించలేదు. దీంతో గుజరాత్ హైకోర్టుకు వెళ్లారు రాహూల్ గాంధి. జులై 7వ తేదీన గుజరాత్ హైకోర్టు రాహూల్ రివ్యూ పిటిషన్ పై విచారణ జరిపి కొట్టేసింది. దీంతో ఇప్పుడు రాహూల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.