అంబానీ జీతంతో పోలిస్తే పిల్లల జీతం ఎక్కువా
రిలయన్స్ ముకేశ్ అంబానీ పిల్లల జీతమెంతో తెలుసా?
స్పెషల్ రిపోర్ట్- ఆసియాలోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ముగ్గురు పిల్లలు ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఐతే ఈ ముగ్గురు ఆకాశ్ (Akash Ambani), ఈశా (Esha Ambani), అనంత్ (Anant Ambani) లు రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు డైరెక్టర్లుగా ఎటువంటి వేతనం తీసుకోకుండా పనిచేయనున్నారట. కానీ కంపెనీ బోర్డు సమావేశానికి హాజరైతే ఫీజు, కంపెనీ ఆర్జించిన లాభాలపై కమీషన్ను మాత్రమే వాళ్లకు చెల్లిస్తారని తెలుస్తోంది. ముకేశ్ ముగ్గురు పిల్లలు ఆకాశ్, ఈశా, అనంత్ లను కంపెనీ బోర్డులో చేర్చుకునేందుకు వాటాదార్ల అనుమతి కోరుతూ చేసిన తీర్మానంలో ఈ మేరకు పొందుపర్చినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పేర్కొంది. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఈ తీర్మానాన్ని వాటాదార్లకు రిలయన్స్ పంపించింది. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి జీతం లేకుండా కంపెనీలో పనిచేస్తున్నారు.
ఇప్పుడు ఆయన బాటలోనే ఆయన పిల్లలు కూడా వేతనం లేకుండా పనిచేస్తుండటం సర్వత్రా ఆసక్తిరేపుతోంది. ఐతే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా పనిచేస్తున్న ముకేశ్ సమీప బంధువులు హితల్, నికిల్ లు వేతనంతో పాటు ఇతర భత్యాలు, కమీషన్లు సహా అన్ని ప్రయోజనాలు తీసుకుంటున్నారు. ఇఖ ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ 2014లో కంపెనీ బోర్డు డైరెక్టర్ గా నియమితులైన టైంలో ఉన్న నియామక షరతులే ఆకాశ్, అనంత్, ఈశాలకూ వర్తించనున్నాయని పేర్కొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో నీతా అంబానీ కంపెనీ బోర్డు సమావేశాలకు హాజరైనందుకు సిట్టింగ్ రుసుం కింద 6 లక్షలు, కమీషన్ రూపంలో 2 కోట్లు పొందినట్లు రిలయన్స్ వార్షిక నివేదిక చెబుతోంది. 2020-21లో నీతా అంబానీ సిట్టింగ్ రుసుం 8 లక్షలు, 1.65 కోట్ల కమీషన్ తీసుకున్నారు.