సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల పెళ్లి వేడుక ఓటీటీలో
మూవీ రిపోర్ట్- మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) తాజాగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటలీలోని టస్కానీలో నవంబర్1న వీరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ పెళ్లికి సంబందించిన ప్రత్యేక వీడియో మొత్తం ఓటీటీలో ప్రసారం కానుందని ప్రచారం జరుగుతోంది.
మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో పాటు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు కొందరు ఇటలీలో జరిగిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహానికి హాజరయ్యారు. ఇందుకు సంబందించిన ఫొటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ పెళ్లి వేడుక మొత్తం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కానుందని సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తుండటంతో తమ అభిమాన హీరో పెళ్లి వేడుకను ఎంచక్కా టీవీలో చూడొచ్చంటూ అభిమానులంతా ఆనందించారు. ఐతే ఇందులో ఎలాంటి నిజం లేదని వరుణ్ తేజ్ టీమ్ స్పష్టం చేసింది. ఇలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని అభిమానులకు స్పష్టం చేసింది.
మరోవైపు ఇటలీలో జరిగిన వివాహ వేడుకలకు హాజరుకాలేకపోయిన బంధుమిత్రుల కోసం నవంబర్ 5న హైదరాబాద్లో గ్రాండ్ గా వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేయగా.. వెంకటేశ్, జగపతిబాబు, మురళీ మోహన్, రాజేంద్రప్రసాద్, జయసుధ, దిల్రాజు, బోయపాటి శ్రీనివాస్, సుకుమార్, గుణశేఖర్ తో పాటు పలువురు సినీ దర్శకులు, నిర్మాతలు, నటులు హాజరయ్యారు.