ప్రభుత్వ టీచర్ ను అతిదారుణంగా హతమార్చిన దుండగులు
స్పెషల్ రిపోర్ట్- ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్య తీవ్ర కలకలం రేపుతోంది. గత 20 ఏళ్లుగా రాజకీయంగా, ఆర్థికంగా తమను దెబ్బతీశాడనే కారణంతో టీచర్ కృష్ణను అతి దారుణంగా హత్య చేశారు. రెక్కీ నిర్వహించి మరీ హతమార్చారు. కృష్ణ ఉదయం బైక్ పై స్కూల్ కు బయల్దేరి వెళ్తున్న సమయంలో వెంటపడి బొలెరో వాహనంతో ఢీకొట్టారు. ఆ తర్వాత రాడ్డుతో కొట్టి చంపారు. టీచర్ ఏగిరెడ్డి కృష్ణ హత్య కేసులో పోలీసులు ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేశారు.
ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి అదుపులో ఉంది. ఎవరూ ఆగ్రహావేశాలకు వెళ్లొద్దని, అనవసరంగా లా అండ్ ఆర్డర్ ను చేతుల్లోకి తీసుకోవద్దని జిల్లా ఎస్పీ దీపికా చెప్పారు. గ్రామంలో పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది. ప్రధాన నిందితుడు వెంకటనాయుడితో పాటు మోహన్, గణపతి, రామస్వామిని అరెస్టు చేశామని ఆమె తెలిపారు. బిల్లుల మంజూరు, రాజకీయ ఎదుగుదలను అడ్డుకుంటున్నాడనే కక్షతోనే ఉపాధ్యాయుడిని హతమార్చారని ఎస్పీ చెప్పారు.
గతంలో తెర్లాం మండలం ఉద్దవోలు గ్రామంలో వెంకటనాయుడు కుటుంబీకులు ప్రభుత్వ నిర్మాణాల పనులు చేశారు. దీనికోసం 2 కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టుబడి పెట్టారు. ఆ బిల్లులు అవ్వకుండా టీచర్ ఏగిరెడ్డి కృష్ణ అడ్డుపడుతున్నారనే కారణంతో ఆయన్ను హత్య చేశారు. ప్రధాన నిందితుడు వెంకటనాయుడు, టీచర్ కృష్ణ మధ్య చాలా కాలంగా ఆధిపత్య పోరు జరుగుతోంది. దీనిలో భాగంగానే ఈ హత్య జరిగిందని, ఇద్దరూ గతంలో రెండు వేర్వేరు పార్టీల్లో ఉండగా, ప్రస్తుతం ఇద్దరూ అధికార వైసీపీలో ఉండటం గమనార్హం.