నాకు రక్షణ కల్పించండి- చంద్రబాబును కలిసిన శ్రీదేవి
పొలిటికల్ రిపోర్ట్- గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి (Vundavalli Sridevi) తెలుగుదేశం పార్టీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) ను కలిశారు. చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో ప్రాజెక్టుల పరిశీలనలో ఉండగా, భర్తతో కలిసి అక్కడికి వెళ్లిన శ్రీదేవి ఆయనను కలిశారు. మొన్నామధ్య ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారనే ఆరోపణల నేపధ్యంలో శ్రీదేవిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ (YCP). ఇటువంటి సమయంలో ఆమె చంద్రబాబు నాయుడుతో సమావేశమవ్వడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
తనను రాజకీయంగా భ్రష్టు పట్టించారని, రాజకీయ సన్యాసం చేయించారని తీవ్ర ఆవేధన వ్యక్తం చేసింది శ్రీదేవి. గత మూడు ఎన్నికల్లో తన నియోజకవర్గంలో తాను వైసీసీని గెలిపిస్తే, తనపై సొంత పార్టీ నాయకులతో, గూండాలతో దాడి చేయించారని అన్నారు. తాను ఎస్సీ మహిళ అని కూడా చూడకుండా దుర్మార్గంగా ప్రవర్తించారని వాపోయింది ఉండవల్లి శ్రీదేవి. మరి శ్రీదేవి చంద్రబాబు ను కలవడంపై వైసీపీ ఎలా స్పందిస్తుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు త్వరలోనే శ్రీదేవి టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.