వివేకా హత్య కేసులో సీబీఐకి కీలక విషయాలు వెల్లడించిన సునీత
వైఎస్ భారతి ఆ టైంలో ఆందోళనగా కనిపించారు- వివేకా కూతురు సునీత
స్పెషల్ రిపోర్ట్- మాజీ మంత్రి, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM Jagan) చిన్నాన్న వైఎస్ వివేకా (YS Viveka) హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ హత్య కేసుకు సంబంధించి కీలక సాక్షుల వాంగ్మూలాలను గత నెల 30న సీబీఐ (CBI) అధికారులు కోర్టుకు సమర్పించారు. ఐతే ఈ విషయాలు కాస్త ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి (Sunitha Reddy) సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పొందుపర్చిన కీలక అంశాలు తాజాగా బయటకు రావడం ఆసక్తిరేపుతోంది.
సీబీఐకి సునీత ఇచ్చిన వాంగ్మూలంలో పలు కీలక అంశాలను చెప్పింది. అవి ఆమె మాట్ల్లోనే.. 2019 మార్చి 22న వైఎస్ భారతి (YS Bharati) నాకు ఫోన్ చేసి ఇంటికొచ్చి కలుస్తానని చెప్పింది. ఐతే నేను కడపతో పాటు సైబరాబాద్ కమిషనరేట్ కు వెళ్లాల్సి ఉందని భారతికి చెప్పాను. ఎక్కువ టైం తీసుకోను అంటూ భారతి మా ఇంటికి వచ్చింది. ఆమెతో పాటు విజయమ్మ (Vijayamma), వైఎస్ అనిల్ రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy) రావడంతో నేను ఆశ్చర్యపోయాను. సమయం లేకపోవడంతో లిఫ్ట్ దగ్గరే నిలబడి భారతితో మాట్లాడాను.
ఆ సమయంలో భారతి కొంత ఆందోళనగా కనిపించింది. నాన్న మరణించాక మొదటిసారి ఇంటికొచ్చినందుకు బాధగా ఉన్నారని అనుకున్నాను. ఇకపై ఏం చేసినా సజ్జల రామకృష్ణా రెడ్డితో టచ్ లో ఉండాలని భారతి చెప్పింది. మీడియాతో మాట్లాడాలని సజ్జల రామకృష్ణారెడ్డి నాకు సూచించారు. సజ్జల ఆలోచన కొంత ఇబ్బందిగా అనిపించి నేరుగా మీడియాతో మాట్లాడకుండా ఒక వీడియో రికార్డు చేశాను. నాన్న గది శుభ్రం చేసేటప్పుడు అక్కడే ఉన్న సీఐ శంకరయ్యపై ఫిర్యాదు చేస్తున్నట్లు వీడియో రికార్డు చేసి సజ్జలకు పంపించాను.. అని సీబీఐ వాంగ్మూలంలో సునీత చెప్పినట్లు తెలుస్తోంది.
ఐతే వీడియో కాదు, ఈ అంశానికి ముగింపు పలికేలా ప్రెస్ మీట్ పెట్టాలని సజ్జల రామకృష్ణా రెడ్డి నాకు చెప్పారు. జగనన్నతో పాటు అవినాష్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించాలని సజ్జల సలహా ఇచ్చారు. నేను అప్పటి వరకు అవినాష్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. అవినాష్ పేరు ప్రస్తావించాలని సజ్జల చెప్పినప్పుడు కొంత ఆలోచించాను. అవినాష్ అభ్యర్థిత్వాన్ని మా నాన్న కోరుకోలేదని నాకు తెలుసు. మా రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా విభేదాలున్నాయి.
సజ్జల సలహా మేరకు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టాను. గదిని శుభ్రం చేయడంపై దర్యాప్తు చేయాలని ముందు నుంచీ అడుగుతున్నాను. పొరపాటు జరిగిందని తెలుసు. క్రిమినల్ మైండ్ ఎలా పనిచేస్తుందో నేను అర్థం చేసుకోలేదు. జగనన్నను ముఖ్యమంత్రిగా చూడాలని నాన్న చాలా కష్టపడ్డారు. ఎవరో చేసిన పొరపాట్లవల్ల మళ్లీ జగన్ నష్టపోవాలా అని ఆలోచించాను.
ఇక హాస్పిటల్ దగ్గర మార్చురీ బయట ఉన్నప్పుడు ఓ కంప్లైంట్ రాసుకొచ్చి నన్ను సంతకం చేయమని అడిగారు. అందులో బీటెక్ రవితో పాటు మరికొంత మంది తెలుగు దేశం పార్టీ నేతలపై ఆరోపణలున్నాయి. ఐతే ఆ ఫిర్యాదుపై నేను సంతకం చేయలేదు. 2019 జులైలో అవినాష్ రెడ్డిపై నాకు అసహనం ప్రారంభమైంది. మా కొడుకుకు ముందే తెలుసునని గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి తల్లి ఒకరితో చెప్పడం నా దృష్టికి వచ్చింది.
నాన్న చనిపోయిన విషయం బయటకు రాకముందే కుమారుడికి తెలుసునని ఆమె చెప్పడంతో నాలో అనుమానం మొదలైంది. అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డికి ఉదయ్ కుమార్ రెడ్డి ప్రధాన అనుచరుడు కాబట్టి ఆనుమానం వచ్చింది. వైఎస్ భారతి, సజ్జల రామకృష్ణారెడ్డిల వాట్సప్ చాట్ స్క్రీన్ షాట్ లను సీబీఐకి అందించాను.. అని సీబీఐ కి ఇచ్చిన స్టేట్మెంట్ లో చాలా క్లియర్ గా జరిగిన విషయాలను వెల్లడించారు వైఎస్ సునితా రెడ్డి. మరి ముందు ముందు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఏ మలుపు తిరుగుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.