25 మంది సజీవదహనం
బస్సులో చెలరేగిన మంటలు - 25 మంది సజీవదహనం
నేషనల్ డెస్క్- మహారాష్ట్ర లో గత అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో మంటలు చలరేగి ఏకంగా 25 మంది చనిపోయారు. బుల్దానా లోని సమృద్ధి మహామార్గ్ ఎక్స్ ప్రెస్ వేపై వెళ్తున్న ఓ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 25 మంది ప్రయాణికులు సజీవదహనమవ్వగా.. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదంలో గాయపడ్డవారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. యావత్మాల్ నుంచి బస్సు 32 మంది ప్రయాణికులతో పుణెకు వెళ్తుండగా శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు టైర్ పేలి రోడ్డు డివైడర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. బస్సులో చెలరేగిన మంటల ధాటికి బస్సు పూర్తిగా కాలి బూడిదైపోయింది. క్షతగాత్రులను స్థానిక బుల్దానా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బస్సు ప్రమాద ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాధ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.