తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ
హైకోర్టులో శ్రీనివాస్ గౌడ్ కు చుక్కెదురు - మంత్రి పిటీషన్ ను కొట్టేసిన కోర్టు
స్పెషల్ రిపోర్ట్- తెలంగాణ (Telangana) ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) కు హైకోర్టు (High Court) లో చుక్కెదురైంది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ను తిరస్కరించాలని మంత్రి వేసిన పిటిషన్ ను మంగళవారం హైకోర్టు కొట్టివేసింది. శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదని 2019లో మహబూబ్ నగర్ కు చెందిన రాఘవేంద్రరాజు (Raghavendraraju) పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల నామినేషన్ సందర్బంగా అఫిడవిట్ లో ఆస్తులు, అప్పుల వివరాలు దాచిపెట్టారని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తెచ్చారు.
ఐతే రాఘవేంద్రరాజు వేసిన పిటిషన్ ను తిరస్కరించాలని మంత్రి సుప్రీం శ్రీనివాస్ గౌడ్ కోర్టును ఆశ్రయించారు. మంత్రి అభ్యంతరాలు పరిశీలించాలని గతంలో పిటిషన్ను సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకు సూచించింది. మంగళవారం ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం, శ్రీనివాస్ గౌడ్ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. దీంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికకు సంబందించి హైకోర్టు ఎలాంటి తీర్పు వస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.