మహేశ్ హీరోగా తివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’
మహేశ్ బాబు గుంటూరు కారం బిగ్ అప్డేట్ లీక్ చేసిన హీరోయిన్
మూవీ రిపోర్ట్- సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్ లో మరో మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గుంటూరు కారం (Guntur kaaram) తో హ్యాట్రిక్ కొట్టాలని ఇద్దరూ కసిగా ఉన్నారు. గుంటూరు కారం సినిమాకు సంబందించి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, వీడియోలు మూవీపై అంచనాలను బాగా పెంచేశాయి. ఈ క్రమంలో గుంటూరు కారం హీరోయిన్ మీనాక్షి చౌదరి ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్ డేట్ ను లీక్ చేసింది.
అన్నట్లు ఈ మూవీలో మహేష్ బాబు సరసన ముందుగా పూజా హెగ్డే (Pooja Hegde), శ్రీలీల (Sreeleela)ను హీరోయిన్స్ గా సెలెక్ట్ చేశారు. మరి ఏమైందో తెలియదు కాని అనివార్య కారణాల వలన ఈ ప్రాజెక్ట్ నుంచి పూజా హెగ్డే తప్పుకుంది. ఇంకేముంది గుంటూరు కారం లో లక్కీగా శ్రీలీల మెయిన్ హీరోయిన్ అయింది. ఇక రెండో హీరోయిన్గా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)ని ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది. ఐతే ఈ విషయంపై మూవీ యూనిట్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతూ వస్తోంది.
ఇదిగో ఇటువంటి సమయంలో హత్య (Hathya) సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న అందాల భామ మీనాక్షి చౌదరి తాను గుంటూరు కారంలో నటిస్తున్నట్లు చెప్పేసింది. అక్కడితో ఆగకుండా సినిమా షూటింగ్ కు సంబంధించిన కొన్ని విషయాలను కూడా పంచుకోవడం విశేషం. ఇక గుంటూరు కారం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోందని.. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయిందని మీనాక్షి చౌదరి చెప్పింది. మహేశ్ బాబు అంటే తనకెంతో ఇష్టమని, ఆయనకు తాను అభిమానినని చెప్పుకొచ్చింది. మహేశ్ బాబుతో నటిస్తోన్న అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేనని అంది. షూటింగ్కు వెళ్లిన మొదటి రోజు, మొదటి సన్నివేశమే మహేశ్ తో ఉందని.. ఆ రోజును ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని మీనాక్షి చౌదరి సంతోషంగా చెప్పింది. మహేశ్ బాబు, త్రివిక్రమ్ ల హిట్ కాంబినేషన్ లో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందంది.