బీఆర్ఎస్ కు ఓటేయండి – ప్రధాని మోదీ
కేసీఆర్ కుమార్తె బాగుండాలంటే బీఆర్ఎస్ కు ఓటేయండి – ప్రధాని మోదీ
మధ్యప్రదేశ్- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పక్క రాష్ట్రంలో తెంలగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించడం ఆసక్తికరంగా మారింది. మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని భోపాల్ లో నిర్వహించిన మేరా బూత్.. సబ్ సే మజ్ బూత్ (Mera Booth Sabse Majboot) కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన బీదేపీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కుటుంబ పార్టీలపై మాట్లాడే సందర్బంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై మోదీ విమర్శలు గుప్పించారు.
కేసీఆర్ (KCR) కుమార్తె బాగుండాలంటే బీఆర్ఎస్ (BRS) కు ఓటువేయాలని, ప్రజలు బాగుండాలంటే మాత్రం బీజేపీకి ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) చెప్పారు. 2024 ఎన్నికల్లో బీజేపీ గెలవనుండటం, అవినీతిపై చర్యలు తీసుకోవడంతో ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకచోట చేరాయని మోదీ అన్నారు. ఆ పార్టీలన్నీ కలిసి అవినీతి, కుంభకోణాలకు హామీ ఇస్తాయని, నేను మాత్రం అవినీతిపరులను వదిలిపెట్టేదే లేదన్న హామీ ఇస్తున్నానని చెప్పారు.
బీజేపీకి కార్యకర్తలే పెద్ద బలమన్న ప్రధాని, తాము ఏసీ గదుల్లో కూర్చొని ఆదేశాలు జారీ చేయమని.. ప్రజలతో మమేకమయ్యేందుకు కఠిన వాతావరణ పరిస్థితులనూ ధైర్యంగా ఎదుర్కొంటామని వ్యాఖ్యానించారు. ఓటు బ్యాంకు రాజకీయాలు, బుజ్జగింపు రాజకీయాలకు బీజేపీ దూరమని మోదీ స్పష్టం చేశారు. ఉమ్మడి పౌరస్మృతి పేరిట కొన్ని పార్టీలు ప్రజలను రెచ్చగొడుతున్నాయని, ఐతే వేర్వేరు చట్టాలతో దేశాన్ని ఎలా నడపాలని ప్రశ్నించారు. ఒకే కుటుంబంలోని సభ్యులకు వేర్వేరు నిబంధనలు పని చేయవని ఈ సందర్బంగా కామెంట్ చేశారు.