Navya

రాజయ్యపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సర్పంచి నవ్య

బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్యపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సర్పంచి నవ్య

పొలిటికల్ న్యూస్- స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Rajaiah) పై జానకీపురం సర్పంచ్ కురుసపల్లి నవ్య (Navya) మరోసారి ఆరోపణలు గుప్పించింది. తాజాగా  ఒప్పందం పేరుతో తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే రాజయ్యతో పాటు మరో నలుగురిపైనా ధర్మసాగర్‌ పోలీసుస్టేషన్‌ లో నవ్య బుధవారం ఫిర్యాదు చేసింది. స్టేషన్‌ ఘన్‌ పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారని గతంలో నవ్య చేసిన ఆరోపణలు ఎంత సంచలనం సృష్టించాయో అందరికి తెలిసిందే. ఐతే ఆ తరువాత బీఆర్ ఎస్ పెద్దల జోక్యంతో నవ్య, రాజయ్య సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవడంతో వివాదం సద్దుమణిగింది. 

వీరిద్దరి మధ్య సయోధ్య సమయంలో గ్రామ అభివృద్దికి 25 లక్షల రూపాయలు, వ్యక్తిగతంగా మరో 20 లక్షలు ఇస్తానని రాజయ్య హామీ ఇచ్చారు. ఈ క్రమంలో నిధులు ఇవ్వకపోగా, తాను రాజయ్య నుంచి డబ్బులు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోందని నవ్య ఆవేధన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో నవ్య భర్త ప్రవీణ్‌కు రాజయ్య 7లక్షలు ఇచ్చారు. మిగతా నగదు ఇవ్వాలని అడిగితే ఒప్పంద పత్రంపై సంతకం చేయాలని ఒత్తిడి తెచ్చారు. గతంలో చేసిన లైంగిక ఆరోపణలు రాజకీయ కోణంలో చేసినవని చెప్పాలని ఒప్పంద పత్రంపై సంతకం చేయాలని నవ్యపై ఒత్తిడి తెచ్చారని నవ్య ఆరోపిస్తోంది. 

పలుమార్లు ప్రవీణ్‌కు ఎమ్మెల్యే ఫోన్‌ చేసి వేధించారని.. దీంతో ప్రవీణ్‌ ఒప్పంద పత్రాన్ని తీసుకువచ్చి దానిపై సంతకం పెట్టమని నవ్యను ఒత్తిడికి గురిచేశాడు. సంతకం పెడితే తాను తప్పు చేస్తున్నట్లు అవుతుందని నవ్య తిరస్కరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే రాజయ్యపై, పీఏ శ్రీనివాస్‌, ఎంపీపీ నిమ్మ కవిత, తన భర్త ప్రవీణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది నవ్య. దీంతో మరోసారి రాజయ్య, నవ్య వివాదం సంచలనం రేపుతోంది.
 


Comment As:

Comment (0)