తిరుమల అలిపిరి మార్గంలో చిరుత దాడి.. బాలిక మృతి
అలిపిరి (తిరుమల) రిపోర్ట్- తిరుమల (Tirumala) తిరుపతి కొండపై మరోసారి తీవ్ర విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. మొన్నామధ్య కాలినడక మార్గంలో బాలుడిపై చిరుత దాడి చేసిన ఘటన మరవకముందే తిరుమల కొండపైకి వెళ్లే అలిపిరి (Alipiri) కాలినడక మార్గంలో చిరుత దాడిలో ఆరేళ్ల బాలిక మృతి చెందిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో చిన్నారి లక్షిత సహా కుటుంబ సభ్యులు అలిపిరి నుంచి కాలినడకన శ్రీవారి దర్శనానికి వెళ్లారు. రాత్రి 11 గంటలకు మధ్యలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి గుడి వద్దకు చేరుకున్నారు. మరో గంటలో తిరుమల కొండపైకి చేరుకుంటారనగా, అందరి కంటే ముందు వెళ్తున్న చిన్నారి లక్షితపై ఒక్కసారిగా చిరుత దాడి చేసింది (Leopard Attack at Tirumala)
కుటుంబ సభ్యులు భయంతో కేకలు వేయడంతో వారి కళ్లముందే చిన్నారిని అడవిలోకి లాక్కెళ్లింది. భయబ్రాంతులకు గురైన బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. రాత్రి సమయం కావడంతో గాలింపు చర్యలు చేసేందుకు వీలు కాలేదు. శనివారం ఉదయం చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కొంత దూరంలో బాలిక మృతదేహాన్ని కనుక్కున్నారు. చిన్నారి లక్షిత మృత దేహాన్ని చిరుత సగం తినేసినట్లు గుర్తించారు. నెల్లూరు జిల్లాలోని పోతిరెడ్డిపాలెం బాధితుల స్వస్థలం.