జనసేన విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్
వాళ్లంతా సిగ్గుపడాలన్న పవన్ కల్యాణ్
పొలిటికల్ రిపోర్ట్- ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలకు కనువిప్పు కలిగించేందుకే తాను రాజ్యాంగ ప్రతి తెచ్చానని పార్టీ నేతలకు వివరించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). అధికారంలోకి వస్తే ఇష్టం వచ్చినట్టు చేయొచ్చని కొందరి భావన అని అధికారను ఉద్దేశించి అన్నారు. చేసేపని సరైందే అని ఐపీఎస్ అధికారులకు అనిపిస్తుందా అని ప్రశ్నించారు పవన్. ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న కొందరు అధికారులు సిగ్గు పడాలని కామెంట్ చేశారు. మమ్మల్ని ఎన్నితిట్టినా భరించామని చెప్పిన పవన్ కళ్యాణ్.. పదవి, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని చెప్పారు. సొంత రాష్ట్రానికి రాకుండా తనను పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ లో 40 ఏళ్ల అనుభవమున్న పార్టీ కూడా ఒడుదొడుకులు ఎదుర్కొంటోందని పవన్ కళ్యాణ్ ఆవేధన వ్యక్తం చేశారు. సమస్యల మధ్య పార్టీని నడుపుతున్నానంటే అది రాజ్యాంగం ఇచ్చిన బలమేనని అన్నారు. మంగళగిరిలోని జనసేన (Janasena) పార్టీ కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇండియా.. భారత్ పేర్ల మార్పుపై దేశమంతా చర్చించుకుంటున్నారని ఈ సందర్బంగా అన్నారు పవన్. ఇండియా దట్ ఈజ్ భారత్ అని రాజ్యాంగం మొదటి పేజీలోనే ఉందని ఆయన గుర్తు చేశారు. బ్రిటీష్ వారికి భారత్ అని నోరు తిరగక ఇండియా అని ఉండవచ్చని తన అభిప్రాయాన్ని చెప్పారు.
తాను ఎప్పుడూ భారతీయుడిగానే మాట్లాడుతున్నానని చెప్పిన పవన్.. 389 మంది మేధోమథనం చేయడం వల్ల మన రాజ్యాంగం వచ్చిందని అన్నారు. సనాతన ధర్మం.. తనను తాను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తుందని, కాలం, అవసరాలు, పరిస్థితుల మేరకు సనాతన ధర్మం మారుతుందని పవన్ చెప్పారు. ద్వేషం, దోపిడీ కొంతకాలమే ఉంటాయని, ధ్వేషంతో కూడిన వాదనలు కచ్చితంగా కనుమరుగవుతాయని అభిప్రాయపడ్డారు.